కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పోరేట్ శక్తులకు అండగా నిలుస్తోందని సీపీఐ జాతీయ సీనియర్ నాయకులు,మాజీ శాసనసభ శాసనమండలి సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు రెండురోజులుగా కార్మికులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో పువ్వాడ ఓ ప్రకటన విడుదల చేశారు.కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దశలవారీగా పోరాటాలు చేయాలని శ్రేణులకు పిలుపు నిచ్చారు.
కార్మికులు, ప్రజల బతుకులను చిన్నాభిన్నం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కేరళ వంటి రాష్ర్టాలు అసెంబ్లీ తీర్మానాలు చేసినా కేంద్రానికి చీమకుట్టినైట్టెనా లేదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ ప్రజలపై పన్నులభారం మోపుతున్నదని ఆరోపించారు.రైల్వే, పోస్టల్, బ్యాంకింగ్, విమానయానం, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, విశాఖ ఉక్కును కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే కుట్ర చేస్తున్నారన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పువ్వాడ పేర్కొన్నారు.కార్మికులందరూ ఐక్యంగా పోరాడి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలన్నారు.
కేంద్రం పెట్టుబడిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నదని కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు.