రాబోయే సార్వత్రిక ఎన్నికలను వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.2024 లో జరగబోయే ఎన్నికలు ఆషామాషీగా ఉండవని , 2019 ఫలితాల మాదిరిగా అస్సలు ఉండవనే విషయం జగన్ కు బాగా తెలుసు.ఏపీలో ప్రజా సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నా, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం అనేది సర్వసాధారణమైన విషయంగా జగన్ భావిస్తున్నారు.కాకపోతే తమ రాజకీయ ప్రత్యర్థులు తమకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తూ ఉండడం, వంటి వ్యవహారాలతో జగన్ అలర్ట్ అవుతున్నారు.
తాను చేపట్టిన పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటిని అమలు చేసినా, ఏపీలో అభివృద్ధి అంతంతమాత్రంగా చోటుచేసుకోవడం, టీడీపీ అనుకూల మీడియా మరింతగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కథనాలను ప్రచారం చేస్తూ ఉండటం వంటి వ్యవహారాలతో జగన్ మరింత ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు పైన అనేక విమర్శలు రావడం, దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకుండా, సొంత వ్యవహారాలు చేసుకోవడం , వివిధ సర్వేలు, ఇంటిలిజెన్స్ రిపోర్టర్ లలోనూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిపోర్టులు అందుతూ ఉండడం వంటి వ్యవహారాలతో జగన్ అలర్ట్ అయ్యారట. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని, వారి స్థానంలో ప్రజాబలం ఉన్న యువ నాయకులను ఎంపిక చేయాలని చూస్తున్నారట.

ఈ మేరకు సర్వేలు ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఒక లిస్టు కూడా తయారు చేసినట్లు సమాచారం.ఆ లిస్టు లో ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి వాస్తవ పరిస్థితిని జగన్ వివరిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో వేరే వారికి టిక్కెట్ ఇస్తామని , వారి గెలుపు కోసం మీరు కృషి చేయాలని , మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, కీలకమైన పదవులు ఇస్తామనే హామీ ఇస్తూ, వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం జగన్ చేస్తున్నారట.
దీని ద్వారా ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో అనవసర తల నొప్పులు తగ్గుతాయనే ఉద్దేశం తో ముందు జాగ్రత్తగా జగన్ ఈవిధంగా వ్యవహరిస్తున్నారట.







