యునైటెడ్ కింగ్డమ్తో పంచుకోవాల్సిన క్రిమినల్ రికార్డులకి సంబంధించి భారత్ చర్చిస్తోంది.ఇరు దేశాల మధ్య ఈ మేరకు అవగాహనా ఒప్పందం కుదిరిన నాలుగేళ్ల తర్వాత ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.
సదరు రికార్డుల ఫార్మాట్కు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ వచ్చే వారంలో భారత్లో పర్యటించనున్నారు.
అలాగే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం త్వరలోనే ఇండియాకు రానున్నారు.
జనవరి 2018లో కుదిరిన ఎంఓయూ ప్రకారం యూకే- ఇండియాల మధ్య సమాచార మార్పిడిలో భాగంగా క్రిమినల్ రికార్డులు, వేలిముద్రలు, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం వుంటుంది.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసుల అభిప్రాయాలను కోరినట్లుగా తెలుస్తోంది.అయితే నిందితులు, దోషులుగా తేలిన వ్యక్తుల బయోమెట్రిక్లను విదేశాలతో పంచుకోవడానికి చట్టపరమైన ప్రతిబంధకాలు వుండవచ్చు.
గోప్యత చట్టాల కారణంగా ఇది ప్రభుత్వానికి ఒక సవాల్ వంటిదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్), సెంట్రలైజ్డ్ ఆన్లైన్ డేటాబేస్ ఆఫ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ (ఎఫ్ఐఆర్), ఛార్జ్షీట్లు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టుల ద్వారా అవసరమైన వివరాలను సేకరించేందుకు ఉపయోగించవచ్చో లేదో అన్న అంశంపై హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.సీసీటీఎన్ఎస్ అనేది దేశవ్యాప్తంగా వున్న 16,000 పోలీస్ స్టేషన్లను అనుసంధానించే వేదిక.రాష్ట్ర పోలీసులంతా సీసీటీఎన్ఎస్ మాడ్యూల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం తప్పనిసరి.
2018 జనవరి 14 నాటి యూకే హోమ్ ఆఫీస్ ప్రకటన ప్రకారం క్రిమినల్ రికార్డ్స్ ఎక్స్చేంజ్ ద్వారా నేరస్తుల నుంచి ప్రజలను రక్షించడంలో పోలీసులకు సహాయం చేస్తుందని తెలిపింది.అలాగే ఇరు దేశాలలోని కోర్టులు మరింత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తాయని వెల్లడించింది.2018 ఏప్రిల్లో ప్రధాని మోడీ యూకే పర్యటన సందర్భంగా అంతర్జాతీయ నేరాలను , తీవ్రమైన వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడం కోసం సమాచార మార్పిడి, సహకారానికి సంబంధించి అవగాహనా ఒప్పందంపై సంతకం చేశారు.క్రైమ్ రికార్డ్స్, ఇమ్మిగ్రేషన్ రికార్డులు, ఇంటెలిజెన్స్ మార్పిడి కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే ఈ ఎంఓయూ ముఖ్యోద్దేశం.
ఇకపోతే.Five Eyes allianceలో యూకే భాగస్వామి వున్న సంగతి తెలిసిందే.
ఇందులో యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు మిగిలిన సభ్య దేశాలు.ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, సమాచారాన్ని ఈ దేశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటాయి.
అయితే అంతకుముందు 2016లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అభ్యంతరాల నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని గ్లోబల్ టెర్రర్ డేటాబేస్, టెర్రరిస్ట్ స్క్రీనింగ్ సెంటర్ (టీసీఎస్)లో చేరడానికి భారతదేశం నిరాకరించింది.టీసీఎస్ వద్ద 11,000 మంది ఉగ్రవాద అనుమానితుల డేటా బేస్ వుంది.







