జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ వెళ్ళబోతున్నారు.అక్కడ ఇటీవల వైసిపి కార్యకర్తల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించబోతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పవన్ నేరుగా అక్కడి నుంచి విశాఖకు ఎయిర్ పోర్ట్ లో దిగుతారు.ఆ తరువాత రోడ్డు మార్గం ద్వారా కాకినాడ చేరుకోబోతున్నట్టు సమాచారం.
కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి పవన్ కు ఫోన్ రావడంతో ఢిల్లీ కి వెళ్ళాడు.అక్కడ రెండు రోజుల పాటు ఉన్న పవన్ ఆర్ఎస్ఎస్ నాయకులతో రహస్యంగా మంతనాలు చేసినట్టు కూడా బయటకు పొక్కింది.
ఇక పవన్ బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేయబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు కూడా ఈ సందర్భంగా వ్యక్తమయ్యాయి.అయితే ఇప్పటి వరకు స్పందించలేదు.

ఇక ప్రస్తుతం కాకినాడ పర్యటన గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసిపి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ విమర్శలు స్థానిక జనసేన నాయకులకు ఆగ్రహం తెప్పించాయి.దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటి వద్ద జనసేన కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలకు, ద్వారంపూడి అనుచరులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు, రాళ్ల దాడికి దారి తీసి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.దీనిపై పోలీసులు జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో ఈ వివాదం కాస్త మరింత తీవ్రతరమైంది.

దీనిపై ఢిల్లీ నుంచి స్పందించిన పవన్ తాను ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ కి వస్తానని, అక్కడే తాడో పేడో తేల్చుకుంటాను అంటూ ప్రకటించారు.ఆయన చెప్పినట్టుగానే నేడు ఢిల్లీ నుంచి పవన్ నేరుగా కాకినాడ రాబోతున్నారు.అయితే ముందుగా రాళ్ల దాడిలో గాయపడిన వారిని పరామర్శించి వారికి అన్ని విధాలుగా పార్టీ అండగా నిలబడుతుంది అని భరోసా ఇవ్వబోతున్నారు.ఆ తరువాత తన ఢిల్లీ పర్యటన విశేషాలు గురించి పార్టీ కీలక నాయకులతో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే పవన్ తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి పై సైలెంట్ గా ఉండే అవకాశం లేదు.ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడమో లేక నిరసన కార్యక్రమాలు చేపట్టడమో చేసే అవకాశం కనిపిస్తుంది.
అందుకే పవన్ పర్యటన పై అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి.