రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో, ఎప్పుడు ఏ నాయకుడు కీలకం అవుతాడో చెప్పలేము.పార్టీల అవసరాలను బట్టి నాయకులకు విలువ ఏర్పడుతుంది.
ఇక ఇప్పుడు అటువంటి పరిస్థితే ‘కాపు’ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విషయంలోనూ చోటుచేసుకోబోతున్నట్టు కనిపిస్తోంది.ఈ మేరకు బీజేపీ అగ్ర నాయకులు ముద్రగడ ను బీజేపీలో చేరేలా వర్తమానాలు పంపుతున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ, వైసీపీ పార్టీలకు భిన్నంగా ఏపీలో సామాజిక సమీకరణాలతో పైకి ఎదగాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు ముద్రగడ ద్వారా కాపు సామాజిక వర్గానికి బాగా దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు.
కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ సైతం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ల గురించి సానుకూల దృక్పధంతో మాట్లాడుతున్నాడు.ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం పార్టీ బాగా బలహీన పడిందని ఒక అంచనాకు వచ్చిన బీజేపీ ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉంది.
ఈ నేపథ్యంలోనే ముద్రగడను బీజేపీ లో చేర్చుకునేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తోంది.

ఏపీలో రెడ్డి సామాజికవర్గం వారంతా వైసీపీ వైపు ఉంటే కమ్మ సామాజికవర్గం వారు టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు.కానీ ఏపీలో ప్రధాన సామాజికవర్గం గా ఉన్న కాపులు మాత్రం ఏకాభిప్రాయం లేక ఎవరికి నచ్చిన పార్టీకి వారు మాద్దతుగా నిలబడుతున్నారు.అయితే వారిని దగ్గర తీయడం ద్వారా ఏపీలో బీజేపీ జెండా రెపరెపలాడించవచ్చని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.
ఈ క్రమంలోనే కాపు కులానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.చంద్రబాబుతో కాపులకు బీసీ రిజర్వేషన్లు కోసం అయిదేళ్ల పాటు పోరాడిన ముద్రగడ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు.
బాబు ఓడిపోవడంతో ఆ డిమాండ్ కూడా పక్కకు పోయింది.జగన్ కాపుల విషయంలో స్పష్టంగా ఉండడంతో ఏ డిమాండ్ చేయలేని పరిస్థితి ముద్రగడది.ఎన్నికల్లో కాపులు వైసీపీకి మద్దతుగా నిలిచినా రిజర్వేషన్ల అంశాన్నివారు ఎక్కడా ప్రస్తావించలేదు.దీంతో ముద్రగడ పద్మనాభం సైలెంట్ అయ్యారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడను బీజేపీలోకి తీసుకువస్తే కోస్తాలో బీజేపీకి తిరుగు ఉండదని బీజేపీ భావిస్తోంది.అయితే ముద్రగడ కాపు ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.ఆ సామజిక వర్గం వారు ముద్రగడను కీర్తిస్తున్నారు.కానీ ఇప్పుడు కాపు ఉద్యమాన్ని పక్కనపెట్టి రాజకీయాల్లో ఆయన చేరితే ఇప్పటివరకు ఆయనకు ఉన్న క్రెడిబులిటీ మొత్తం దెబ్బతింటుంది.
అందుకే ఆయన బీజేపీలో చేరాలంటే కాపులను బీసీల్లో చేర్చుతామని కేంద్రం హామీ ఇవ్వాలి.ఎటూ ఈ సమస్య కేంద్రం పరిధిలోది కాబట్టి బీజేపీ ఈ మేరకు హామీ ఇవ్వాల్సివుంటుంది.
మరి బీజేపీ దానికి ఒప్పుకుంటుంటుందా అనేదే తేలాల్సి ఉంది.ఎందుకంటే బీజేపీ ఇక్కడ హామీ ఇస్తే మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే రకమైన డిమాండ్ తెర మీదకు రావచ్చు.
అయితే ఎన్ని చేసినా కాపు సామజిక వర్గం మొత్తం ముద్రగడ వెంటే నడుస్తారనే గ్యారంటీ లేదు.ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా ఆ సామాజిక వర్గం మద్దతుగా నిలబడుతుండడంతో బీజేపీ రకరకాల కోణాల్లో దీనిపై ఆలోచిస్తోంది.







