కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్న ‘కాపు’ నాయకులు ఎట్టకేలకు అధినేత చంద్రబాబు తో సమావేశం అయ్యారు.కొద్దీ రోజుల క్రితం రెండు మూడు పర్యాయాలు కాకినాడలో సమావేశం అవ్వడం, టీడీపీలో జరుగుతున్న పరిణామాలను గురించి చర్చించడం ఆ సందర్భంగా అధినేత చంద్రబాబు తీరును కూడా తప్పుపట్టడం ఇవన్నీ జరిగాయి.
అయితే వీరంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోతున్నారనే కథనాలు కూడా ప్రచారం అయ్యాయి.తాజాగా సోమవారం చంద్రబాబుతో భేటీ అయిన వీరంతా టీడీపీలో జరుగుతున్న పరిణామాల గురించి బాబుతో కుండ బద్దలకొట్టినట్టు మాట్లాడేశారట.“తెలుగుదేశం పార్టీలో వియ్యంకులదే రాజ్యంగా ఉందని, మాజీ మంత్రులు, వియ్యంకులు నారాయణ, గంటా శ్రీనివాసరావు చెప్పిందే చేశారు.మీకు మేము పనికి రాలేదు” అంటూ కాస్త గొంతు పెంచి మరీ చెప్పారట.
పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ జెండా మోసింది, కష్టకాలంలో వెన్నంటే ఉంది ఒక్క కాపులు మాత్రమేనని, అయినా పార్టీకి సంబందించిన పదవుల్లో కానీ, ప్రభుత్వ పదవుల్లో కానీ మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అటువంటప్పుడు మేము ఈ పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటి అంటూ చంద్రబాబు తో చెప్పినట్టు తెలుస్తోంది.అంతే కాకుండా తమకు పార్టీలోనూ, గత ప్రభుత్వంలోనూ జరిగిన అవమానంపై మండిపడినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కాపు నాయకులు ఎంతో చేశారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి గౌరవం కాపులకు ఇప్పుడు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారట.అసలు పార్టీలో కాపులంటే విలువ లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారట.

గతంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన రిజర్వేషన్ పోరాటాన్ని పార్టీలో కొందరు కాపు నాయకుల ద్వారా అణిచివేశారని కొంతమంది నాయకులు అధినేత ముందే ఫైర్ అయ్యారట.ఈ సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులు గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఇంతకు ముందెప్పుడూ మాట్లాడని విధంగా అధ్యక్షుడితో మాట్లాడినట్లు తెలుస్తోంది.మీరెప్పుడూ పార్టీలో ఒకరిద్దరు కాపు నాయకులకే ప్రాధాన్యం కల్పించారని, మిగిలిన వారి గురించి అస్సలు ఎప్పుడూ పట్టించుకోలేదని కాపు నాయకులు ఆవేదన చెందినట్టు సమాచారం.కాపు నాయకులు చెప్పిన అన్ని విషయాలను శ్రద్దగా విన్న బాబు ఎవరూ తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ వారిని బుజ్జగించినట్టు తెలుస్తోంది.







