వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి ఒకటే మాట చెప్తూ వస్తోంది.తమకు ఎవరి మీదా కక్షలు లేవని, ఎవరి మీద ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదని చెప్తూ వస్తోంది.
అదే సమయంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విపరీతమైన అవినీతి జరిగిందని, అవినీతి వ్యవహారాలను సహించబోమని, అన్ని వ్యవహారాల మీద విచారణ చేస్తామని ఏపీ సీఎం జగన్ చెప్పుకుంటూ వచ్చారు.దీనికి తగ్గట్టుగానే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఆ సంఘంలో బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్రెడ్డి, కన్నబాబులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది.ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలను నియమించారు జగన్.
అయితే ఈ ఉపసంఘంలో ఉన్నవారంతా టీడీపీని, చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని విమర్శల బాణాలు వదిలినవారే.
గత ప్రభుత్వాల్లో చూసినా ఏదో ఒక విషయానికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు అవ్వడం సర్వ సాధారణమే.కాకపోతే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 30 అంశాలపై విచారణకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, రాజధాని భూముల వ్యవహారం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అవకతవకలు ఇలా అనేక అంశాలు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు కూడా జగన్ ఓ ఇంటర్వ్యూలో తాము ఖచ్చితంగా చంద్రబాబుపై విచారణ జరిపిస్తామని చెప్పారు.గెలిచాక అది అమలుచేసి చూపిస్తున్నారు.జగన్ ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆరు వారాల్లో నివేదిక ఇవ్వనుంది.దీంతో ఇప్పుడు వైసీపీ , టీడీపీ మధ్య రాజకీయంగా విమర్శలు జోరందుకున్నాయి.
కేవలం తమపై అవినీతి మరక అంటించాలనే దురుద్దేశ్యంతోనే జగన్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
చంద్రబాబు కి విచారణలు ఎదుర్కోవడం కొత్తేమి కాదని, గత రాజశేఖర రెడ్డి హయాంలోనే బాబు పై అనేక విచారణలు చేయించారని, అయినా బాబు పై ఏ ఆరోపణ రుజువు అవ్వలేదని, ఇప్పుడు కూడా తమకు అవినీతి మరక అంటించడం జగన్కు కలగానే మిగిలిపోతుందని టీడీపీ ఎమ్యెల్సీ నారా లోకేష్ కౌంటర్ ఇస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ హయాంలోనే పెంచిన అంచనాలను కేంద్రం ఇప్పుడు ఆమోదించిందని, దీన్నిబట్టి చూసినా బాబు హయాంలో అవినీతి ఎక్కడా జరగలేదనే విషయం ప్రజలకు అర్ధం అయ్యిందని టీడీపీ చెప్పుకొస్తోంది.జగన్ మాత్రం బాబు హయాంలో జరిగిన అవినీతిని నిరూపించి ప్రజల ముందు దోషిని చేయాలని చూస్తున్నాడు.
అందుకే మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే ఆయన గత ప్రభుత్వ అవినీతిని బయటపెట్టిన మంత్రులకు సన్మానం చేస్తా అంటూ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఉప సంఘం ఏమీ తేల్చలేదని పైకి టీడీపీ ధీమాగా చెప్తున్నా లోలోపల మాత్రం ఆందోళనగానే కనిపిస్తోంది.