మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తాజాగా అరవింద సమేత చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించాడు.
గత చిత్రం అజ్ఞాతవాసి ఫలితం నేపథ్యంలో స్క్రిప్ట్పై ఇంకాస్త ఎక్కువ వర్క్ చేసి త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని చేయడం జరిగింది.ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘అరవింద సమేత’ చిత్రాన్ని మొదలు పెట్టిన సమయంలోనే నిర్మాత రాధాకృష్ణ గారు, ఎన్టీఆర్తో మాట్లాడి దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను.అందుకోసం వారు పూర్తిగా సహకరించారు.అంతా సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో షూటింగ్ చివరి దశలో ఉండగా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు చనిపోయారు.
దాంతో షూటింగ్ ఆగిపోయింది.సమయం ఎక్కువ లేని కారణంగా ఎన్టీఆర్ను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనే ఉద్దేశ్యంతో నిర్మాత రాధాకృష్ణ గారితో మాట్లాడి సినిమాను 2019 సమ్మర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.
షూటింగ్ కార్యక్రమాలన్ని నిలిపేయాలని నిర్ణయించుకున్న సమయంలో ఎన్టీఆర్ నుండి ఫోన్ వచ్చింది.హరికృష్ణ గారు చనిపోయిన రెండవ రోజునే ఎన్టీఆర్ నుండి కాల్ వస్తుందని నేను ఊహించలేదు.ఎన్టీఆర్ ఫోన్ లో సామీ షూటింగ్ ప్లాన్ చేయి, రేపు వస్తున్నాను అన్నాడు.నేను షాక్ అయ్యి, పర్వాలేదు అన్నా కూడా వినిపించుకోకుండా, దసరాకు సినిమాను ఎట్టిపరిస్థితుల్లో తీసుకు వద్దాం అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
ఈ సంఘటన ఆయనకు సినిమా పట్ల ఉన్న ఫ్యాషన్ను తెలియజేసింది.ఎంతో మంది సినిమాను ప్రేమిస్తారు, సినిమాను ఇష్టపడతారు, కాని తారక్ మాత్రమే ఇంతగా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతాడు అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.
మరే హీరో విషయంలో ఇలా జరిగినా కూడా సినిమా ఖచ్చితంగా ఆలస్యం అయ్యేది అంటూ నందమూరి అభిమానులు కూడా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అరవింద సమేత చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ అంతా ఉన్నారు.