మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉండే ప్రజల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, జీవనశైలి చాలా భిన్నంగా ఉంటాయని అందరికీ తెలిసిందే.అయితే అలాంటి భిన్నమైన జీవనశైలిని కలిగి ఉండే ఓ తెగ ప్రజల గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
వారే కొండ రెడ్లు.వీరు నిజానికి తెలుగువారే.
కానీ వీరి భాష యాస అసలు తెలుగు భాషకు కొంత తేడా ఉంటుంది.గోదావరి నదికి ఆనుకుని వీరు జీవిస్తుంటారు.
అక్కడ ఉండే కొండల్లోనే వీరి నివాసాలు ఉంటాయి.ఎన్నో ఏళ్ల నుంచి ఆ కొండల్లోనే నివాసం ఉంటున్నారు.
వీరి ఆచారాలు, పద్ధతులు అందరి కన్నా కొంచెం భిన్నంగా ఉంటాయి.

కొండ రెడ్లు ఎక్కువ శాతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో, గోదావరి ఉత్తర దిక్కున ఉన్న చింతూరు, కూనవరం, వర రామచంద్రపురంలలో ఉంటున్నారు.అలాగే దక్షిణ దిక్కున ఉన్న అశ్వరావుపేట, దమ్మపేట, వేలేరుపాడు మండలాల్లోనూ వీరు నివాసం ఉంటున్నారు.వీరితోపాటు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో కూడా కొండరెడ్లు నివసిస్తున్నారు.
గోదావరికి ఇరువైపుల ఉన్న పాపికొండల ప్రాంతంలో వీరు మనకు ఎక్కువగా కనిపిస్తారు.

కొండ రెడ్ల ఆచార వ్యవహారాలు అన్నీ భిన్నంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా.ఈ క్రమంలో వీరు జరుపుకునే పెళ్లిళ్లలో ఖర్చు మొత్తం అబ్బాయి తరఫు వారిదే అవుతుంది.వీరికి వరకట్నం అంటే తెలియదు.
ఇక ఈ జాతి ప్రజల్లో పురుషులు కొందరు ఎక్కువ మంది స్త్రీలను కూడా భార్యగా చేసుకుంటారు.దీంతోపాటు భర్త చనిపోయిన స్త్రీకి మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
ఈ క్రమంలో స్త్రీకి తన భర్త చనిపోతే తన మరిదిని కూడా వీరు చేసుకోవచ్చు.దాన్ని తప్పుగా భావించరు.
ఇక వీరిలో ఏ అమ్మాయి అయినా తన మేనమామ అనుమతితోనే పెళ్లి కుదుర్చుకోవాలి.అలా కాకుండా ఒకవేళ మేనమామకు కొడుకు ఉన్నట్లైతే, మేన కోడల్ని తన కొడుకుకే ఇచ్చి పెళ్లి జరిపిస్తానని అడ్డుచెప్పితే అప్పుడు కుదుర్చుకున్న సంబంధం రద్దవుతుంది.
అలాంటప్పుడు ఒక సీసా సారాను అమ్మాయి ఇంట్లోని ఏదేని ఒక ప్రదేశంలో ఉంచి వెనుదిరుగుతారు.

కొండరెడ్లు పిల్లల విషయంలోనూ పద్ధతులు పాటిస్తారు.వీరు పిల్లలకు దిష్టి తగలకూడదని కాటుకను దిష్టి చుక్కగా పెడతారు.ఇక వీరు ప్రసవాన్ని కీడుగా, మైలగా భావిస్తారు.
కొద్ది రోజుల్లో ప్రసవించబోతుందనుకునే మహిళను, మంత్రసానిని కలిపి వేరే ఇంట్లో ఉంచుతారు.ఆ ఇంటిని కీడుపాక అని పిలుస్తారు.11 రోజుల వరకు వారు అందులోనే ఉండాలి.వారికి కావల్సిన భోజనం, ఇతర వస్తువులను ఇంటి నుంచే పంపిస్తారు.
ఇక డెలివరీ అయిన 11వ రోజున బాలింత స్త్రీకి స్నానం చేయించి ఇంట్లోకి తీసుకువస్తారు.తరువాత సదరు కీడు పాకను నేలమట్టం చేస్తారు.
దాన్ని నిర్మించేందుకు వాడిన కర్రను, ఆకులను కాల్చివేస్తారు.అనంతరం పుట్టిన పిల్లవాడికి దిష్టి తగలకుండా మంచం వద్ద కోడి కోసి నైవేద్యం పెడతారు.
కోడికాలు ఒకటి, రెండు అడ్డాకులు, చాట, రోకలి, వింటిబద్దను పిల్లవాడి చేతిలో పెట్టి, ఆ తరువాత వాటిని తీసి మంటల్లో కాల్చుతారు.

కొండరెడ్లు రజస్వల అయిన అమ్మాయిని కూడా కీడుపాకలో ఉంచుతారు.11వ రోజు స్నానం చేయించి ఇంటికి తీసుకువస్తారు.ఆ తరువాత పాకను కాల్చుతారు.
ఆ రోజుల్లో అమ్మాయికి తోడుగా గ్రామంలోని పెద్ద వయసు స్త్రీలను ఉంచుతారు.ఇక ఆ అమ్మాయికి ఆమెతో ఉండే స్త్రీలే సపర్యలు చేయాలి.
వంట చేసి పెట్టాలి.వంటల్లో ఉప్పు, కారం అల్లం వాడరు.
కాగా 11వ రోజు తరువాత ఆ అమ్మాయి వాడిన, ముట్టుకున్న వస్తువులను అక్కడే వదిలేస్తారు లేదా మరో రజస్వల అయిన అమ్మాయికి ఇస్తారు.అంతేకానీ ఇంటికి వాటిని తీసుకురారు.
లేదంటే గోదావరి నదిలో అయినా కలుపుతారు.ఇవీ.కొండ రెడ్ల ఆచారాలు, వ్యవహారాలు.భలే విచిత్రంగా ఉన్నాయి కదా.!
.






