ఎన్నికల హడావుడి మొదలయ్యిందంటే.ఎక్కడ లేని హాడావుడినే కాదు ఎక్కడలేని సమస్యలు.
అనుమానాలు తలెత్తుతుంటాయి.ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు.
సొంత పార్టీ నేతలైనా.పక్క పార్టీ నేతలైన అనుమానంగానే చూస్తాయి పార్టీలు.
ఎన్నికలన్నాక, పార్టీలన్నాక, అభ్యర్ధుల ఖరారు కోసం సవాలక్ష చర్చలు జరుపుతారు.అన్ని పార్టీల ఆఫీసులు హైదరాబాద్ లోనే ఉండటంతో, రాజధాని కేంద్రంగానే పార్టీ వ్యవహారాలు, కీలక చర్చలు జరుపుతున్నారు.
అయితే ఈ చర్చలన్నీ ఫోన్లలో జరుపుకోలేని పరిస్థితి నెలకొంది.దీనికి కారణం తమ ఫోన్ కాల్స్ ఎక్కడ రికార్డు అవుతున్నాయో అన్న అనుమానమే.

అభ్యర్ధుల ఎంపిక, ఎత్తుకు పైఎత్తులు, ప్రలోభాలు, బెదిరింపులు, బుజ్జగింపులు, ప్రత్యర్థుల పార్టీల్లో రెబల్స్ ను రెచ్చగొట్టి, ఆయా పార్టీలపై తిరుగుబాటు అభ్యర్ధులుగా బరిలో దించడాలు, కొన్ని స్థానాల్లో ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం, సొంత పార్టీ నుంచి బలహీనమైన అభ్యర్థిని బరిలో దించడం, ఇతర పార్టీల్లోని కీలక అంశాలు, చర్చలు, నిర్ణయాలు, వ్యూహప్రతివ్యూహాలు, అధినేతల ఆలోచనలు అన్నీ తెలుసుకోవటానికి కోవర్టుల ఏర్పాటు.నేతల రేట్లు, పోటీ చేస్తే ఎంత ? పోటీ నుంచి తప్పుకోవాలంటే ఎంత ? ఎవరిని ఏ కేసులో ఇరికించాలి ? ఎప్పుడు ? ఎక్కడ ? ఎలాంటి అంశాలను లేవెనెత్తాలి ? జనాన్ని ఎలా రెచ్చగొట్టాలి ? ఓటర్లకు ఏ రకమైన బిస్కట్లు వేయాలి ? ఇలా అనేక అంశాలకు సంబంధించి చాలా చర్చలు ఎన్నికల వేళ జరుగుతుంటాయి.అందరూ ఒకచోట చేరి ఈ అంశాల గురించే చర్చించే అవకాశం కూడా లేదు దీంతో ఏమి చేయ్యాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.

ఎన్నికలు అంటే సవాలక్ష వ్యవహారాలను మాట్లాడాల్సి ఉంటుంది.వీటన్నింటినీ నాయకులు ఫోన్లలో మాట్లాడలేక, ఉండలేక తర్జనభర్జన పడుతున్నారు.ఎవరినీ నమ్మలేక, ఏ ఫోన్లో ఎవరి వాయిస్ రికార్డు అయిపోతోందో తెలుసుకోలేక, ఎవరి వాయిస్ ఎప్పుడు ? ఎలా ? ఏ మీడియా ద్వారా బయటకొస్తుందో తెలియక సెల్ ఫోన్ లో మనసు విప్పి మాట్లాడలేక ఆందోళన చెందుతున్నారు.పెరిగిన టెక్నాలజీ ఎవరి కొంప ముంచేస్తుందో అనే భయంతో ఫోన్లలో చర్చలకు వెనకడుగేస్తున్నారు.ఈ సమస్య కేవలం ప్రతిపక్ష పార్టీలోనే కాదు అధికార పార్టీలో కూడా ఉండడంతో అందరిలోనూ సెల్ భయం కనిపిస్తోంది.
ఏదైనా ముఖ్య విషయం గురించి ఫోన్ లో మాట్లాడాలంటే వణికిపోతున్నారు.
.






