అలిగి బుంగమూతి పెట్టుకున్న ప్రియురాలి వెంట ఐయామ్ వేరీ సారీ అన్నాగా వందోసారి అంటూ పాటలు పాడే ప్రేమికులను చూసాం కాని.ప్రియురాలు అలిగిందని ఐయామ్ వేరీ సారి అంటూ ఏకంగా రోడ్ల మీద బ్యానర్లు పెట్టే ప్రేమికుడు మాత్రం ఒక్కడే అతడే నీలేశ్ .
మహారాష్ట్రలోని పుణే జిల్లాకు చెందిన నీలేశ్ అలకపాన్పు ఎక్కిన తన నెచ్చెలిని శాంతింపచేయడానికి చేసిన ఈ పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
పుణే సమీపంలోని పంప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన నీలేశ్ ఖేడేకర్ వ్యాపారవేత్త.నీలేశ్ ఓ అమ్మాయితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు.అయితే.చిన్న గొడవ కారణంగా ఆమె అలకబూనింది.ఆమె కోపాన్ని తగ్గించడానికి వినూత్నంగా సారీ చెప్పాలనుకున్నాడు.ఇంకేం.
ఆమె వెళ్లే దారిలో, కూడళ్లో పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్లు వెలిశాయి.ఆమె ముంబై నుంచి వస్తోందని తెలుసుకొని, ఆ దారిలో ‘ఐ యామ్ సారీ’ అంటూ బ్యానర్లను కట్టించాడు.
దారెంట చిన్నవి, పెద్దవి కలిపి ఏకంగా 300 బ్యానర్లు కట్టించడం చర్చనీయంగా మారింది.ఈ ‘సారీ’ బ్యాన్లర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే.అతగాడు చూపిన అత్యుత్సాహం పోలీసులకు మాత్రం తలనొప్పులు తెచ్చిపెట్టింది.
పుణే ప్రాంతంలో అకస్మాత్తుగా వెలిసిన బ్యానర్లు, హోర్డింగ్లను చూసి అధికారులు అవాక్కయ్యారు.పోలీసులు ఫిర్యాదు చేశారు.దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ పని చేయించిన వ్యక్తి గురించి వెంటనే ఆరా తీశారు.
మొత్తానికి ఆ బ్యానర్లు కట్టించింది నిలేశ్ అని తేలింది.అనుమతుల్లేకుండా అక్రమంగా బ్యానర్లు కట్టించినందుకు అతడిపై కేసు నమోదు చేసి, జరిమానా విధించారు.ఇంతకీ ప్రియురాలు అలకమానిందా అంటే…ఇంత చేసాక ఏ ప్రియురాలు మాత్రం అతగాడి ప్రేమకు కరిగిపోకుండా ఉంటుందా చెప్పండి.