జనసేనలో కొద్దిరోజులుగా హడావుడి కనిపిస్తోంది.ఇతర పార్టీల నుంచి నేతలు చేరుతున్నారు.
ఇతర పార్టీలో తమకు సీటు దక్కదనుకున్నవారు, పార్టీకి మనుగడలేదని ప్రత్యామ్న్యాయం చూసుకునేవారు ఇలా ఒక్కొక్కరు ఇప్పుడు జనసేన జెండా పట్టుకునేందుకు సిద్ధం అయ్యారు.దీంతో పార్టీలో ఒకటే హడావుడి కనిపిస్తోంది.
జనసేన వలస నాయకులతో ఫుల్ లోడ్ అయిపోతోందంటూ సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెట్టేస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్న… ఇప్పుడు చేరుతున్నవారంతా పార్టీకి ఏ మేరకు ఉపయోగపడతారు.? వారి ప్రభావం ఎంత.? వారికి పార్టీ ఉపయోగపడుతుందా .? వారు పార్టీకి ఉపయోగపడతారా అనే చిక్కు ప్రశ్నలు చాలానే వ్యక్తం అవుతున్నాయి.
జనసేనలో ఇప్పుడు చేరుతున్న వారంతా ఒక ప్రాంతానికి చెందివారే.ఇటీవల చేరిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మళ్లీ తన కుమారుడితో కలిసి పవన్ను కలిసి జనసేన కండువా కప్పుకోవడం, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ కూడా చేరడం, మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయ్ రాజముండ్రి నుంచి కందుల దుర్గేష్ చేరేందుకు సిద్ధం అవ్వడం జనసేన కార్యకర్తల హడావుడికి కారణం.ఆర్నెళ్లుగా పవన్ హడావుడి చేస్తున్నా ఒక్క చేరికా లేకపోవడం… రాష్ట్రవ్యాప్తంగా తెలిసిన ముఖం ఇంతవరకు ఆ పార్టీలో లేకపోవడం, పైకి ఎంత గొప్ప చెప్పుకున్న… లోలోపల మాత్రం తెగ పార్టీ లీడర్, కార్యకర్తలు తెగ బాదపడిపోయేవారు.
రాష్ట్రంలో కనీసం పది శాతం సీట్లకు పోటీ చేయడానికైనా అభ్యర్థులు దొరుకుతారా అన్న భయం ఉండేది.ఇలాంటి పరిస్థితుల్లో ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు చేరడంతో జనసేనలో ఊపు వచ్చినట్టు అయ్యింది.
అయితే ఇప్పుడు పార్టీలో చేరిన వారి సామర్ధ్యం మీద అందరికి అనుమానాలు కలుగుతున్నాయి.ముత్తా గోపాల కృష్ణ చేతిలో పత్రిక, కొత్తగా పెట్టిన టీవీ చానల్ ఉండడం తప్ప రాజకీయంగా ఆయన ప్రభావం అంతంత మాత్రమే.
కాంగ్రెస్ నుంచి వస్తున్న పంతం నానాజీ వెంట ఒక్కరంటే ఒక్క కార్యకర్త కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.ఇక మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి కు క్షేత్ర స్థాయిలో పట్టుంది.ఇక మిగతా నియోజకవర్గాల్లో చూసుకుంటే సరైన అభ్యర్థులు కూడా కనిపించడంలేదు.ఉన్న కొద్దోగొప్పో నేతలు కూడా కేవలం పవన్ ఇమేజ్ మీద ఆధారపడి ఉన్నవారే.