ప్రధాని నరేంద్ర మోదీ కి జమిలి ఎన్నికల మీద మనసు మారడం లేదు.ఎలా అయినా దేశమంతా ఒకేసారి ఎన్నికలు తీసుకొచ్చి రాజకీయంగా బీజేపీ కి మైలేజ్ పెంచి కాషాయ జెండా ఎగురవేయాలని మోదీ ప్లాన్.
అయితే ఆ ఆశ మాత్రం తీరేలా కనిపించడం లేదు.మోదీ ప్లాన్ కు చాలా రాష్ట్రాలు అడ్డు పుల్ల వెయ్యడంతో జమిలి ఎన్నికల ప్లాన్ బెడిసికొట్టింది.
అయితే ఎన్నికల కమిషన్ మాత్రం కొంతలో కొంత ఊరటనిచ్చేలా వ్యాఖ్యలు చేసింది.
ఈ ఏడాది చివరన జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలను జరపడానికి తాము సిద్ధమని, అంతేకాని మిగిలిన రాష్ట్రాలతో కలిపి ఒకే సారి ఎన్నికలను నిర్వహించలేమని ఎన్నికకాల కమిషన్ తన అభిప్రాయాన్ని చెప్పేసింది.దీంతో ఇక నిర్ణయం ప్రధాని మోదీయే తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల ఆలోచన.
ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలన్నా తగిన సిబ్బంది లేరని ఎన్నికల కమిషన్ చేతులెత్తేసింది.ఇక మోదీ ముందున్న మార్గం ఒక్కటే.ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలకూ వెళ్లడమే.ప్రస్తుతం అందుతున్న సర్వేల ప్రకారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో బీజేపీ విజయం అంత ఈజీ కాదని తేలిపోయింది.
ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడిందని సర్వేలు కోడై కూస్తున్నాయి.జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న ఇప్పట్లో సాధ్యపడదు ఎందుకంటే దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉండడమే.
ఇక బీజేపీ తాము జరిపిన అంతర్గత సర్వేలో కూడా మూడు రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్ లోనే కొంత ఛాన్స్ ఉన్నట్లు కనపడుతోంది.ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలకు వెళితేనే మంచిదా? లేక షెడ్యూల్ ప్రకారమే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలా? అన్న ఆలోచనల్లో బీజేపీ నేతలు ఉన్నారు.షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళితే కొన్ని ఇబ్బందులు తప్పవు.మధ్యప్రదేశ్,రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో బీజేపీ ఓటమి పాలయితే వాటి ఫలితాల ప్రభావం ఖచ్చితంగా తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికలపై పడుతుంది.
అయితే ఈ లెక్కలన్నీ వేసుకుని లాభనష్టాలపై మోదీ, అమిత్ షా కుస్తీలు పడుతున్నారు.దీనిపై చివరిగా ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.