కాంగ్రెస్ పార్టీలో నాయకులకు వాక్ స్వతంత్రం ఎక్కువ.ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడినా అధిష్ఠానం చూసి చూడనట్టుగా ఉంటుంది.
అందుకే ఆ పార్టీలో క్రమశిక్షణ కూడా అంతగా కనిపించదు.ఇక తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వస్తే… ఇక్కడ పార్టీలో సీనియర్లు ఎక్కువ.
అందుకే ఎవరికీ వారు మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటూ నిత్యం ఏదో ఒక స్టేట్మెంట్ తో కాకా రేపుతుంటారు.గత కొద్ది రోజులు క్రితం వరకు నేను సీఎం అభ్యర్థిని అంటే నేను అంటూ నాయకులు పోటీ పడి మరీ మీడియా సమావేశాల్లో రెచ్చిపోయేవారు.
పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే మార్గాలు ఆలోచించడం మానేసి గ్రూపు రాజకీయాలతోనే బిజీ అయిపోయేవారు.కానీ కొద్ది రోజులుగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.

ఇప్పుడు అందరూ మౌనం వహిస్తున్నారు.అంతా పరిమితంగా మాత్రమే స్పందిస్తున్నారు ఇందుకు కారణం లేకపోలేదు ఇన్నాళ్లూ పార్టీ ఏఐసిసి ఇంచార్జ్ కుంతియా మాత్రమే పార్టీ వ్యవహారాలు చూసేవారు.కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.ఎలాగైనా ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలలో ఉన్న రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నాడు.అందుకే ముందుగా .గెలుపుకు అవరోధాలుగా భావిస్తున్న పరిస్థితులను కంట్రోల్ చేస్తున్నారు.
పార్టీ నేతలు అనవసర వ్యాఖ్యలకు ముందు అడ్డుకట్ట వేశారు.
దీనికోసం మరో అయిదుగురు ఎఐసిసి కార్యదర్శులను రంగంలోకి దించారు.దీంతో పార్టీలో సీన్ మారిపోయింది.
ఈ కార్యదర్శులంతా పార్లమెంటు నియోజక వర్గాల వారీగా పర్యటనలు చేసి నేరుగా రాహుల్ గాంధీకి రిపోర్ట్ చేస్తున్నారు దాంతో నేతలు ఎవరికి వారు తాము సిఎం పదవికి అర్హులమని చెప్పుకునే వీలు లేదు నేతలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు రాహుల్ కి అందుతుండటంతో ఇక్కడ నేతల నోళ్లు మూత బడ్డాయి.

రాహుల్ చేసిన ఈ ఏర్పాటు వల్ల నేతలంతా కాలక్షేపం రాజకీయాలు మాని సీరియస్ గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అంశాలపై దృష్టి పెడుతున్నారు.సమస్య ఏదైనా ఉంటే గాంధీ భవన్ లో ఉండే ఏఐసిసి ఇంచార్జులకు చెప్పి వెళ్లడం మినహా ఎలాంటి కామెంట్లు, ఆందోళనలు ఆరోపణలు చేయడం లేదు.దీంతో తెలంగాణాలో కాంగ్రెస్ పని కాస్త కుదుటపడినట్టు కనిపిస్తోంది.







