2019 ఎన్నికలు తెలంగాణలో ఎలా ఉన్నా ఏపీలో మాత్రం చాలా రసకందాయంలో ఉంటాయనడంలో ఎలాంటి డౌట్ లేదు.ఇప్పటికే అక్కడ అధికార టీడీపీ – విపక్ష వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగడం ఖాయంగా కనిపిస్తుండగా వచ్చే ఎన్నికల్లో జనసేన రంగంలో ఉండడంతో ఈ మూడు పార్టీల మధ్య రసవత్తర సమరం జరిగేలా కనిపిస్తోంది.
అధికార టీడీపీకి ఎలాగూ బీజేపీతో పొత్తు ఉండే సూచనలు ఉన్నాయి.
ఇక విపక్ష వైసీపీ ఒంటరిపోరు కొనసాగించనుంది.
ఇక కొత్తగా ఎన్నికల బరిలోకి దూకుతున్న జనసేనతో కలిసేందుకు కామ్రేడ్లు రెడీగా ఉన్నట్టు వారి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.సమైక్య రాష్ట్రంలో కూడా కామ్రేడ్లు సొంతంగా సత్తా చాటలేకపోయినా ఏదో ఒక ప్రధాన పార్టీతో కలిస్తే మంచి సీట్లే గెలుచుకునేవారు.
కమ్యూనిస్టులకు చాలా నియోజకవర్గాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది.
ఈ క్రమంలోనే సీపీఐ జనసేనతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉంది.
వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో గత ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ చెరో సీటు గెలుచుకున్నా ఏపీలో మాత్రం ఈ రెండు పార్టీలకు ఒక్కసీటు కూడా లేదు.ఈ క్రమంలో కమ్యూనిస్టులు జనసేనతో జోడీ కడితే జనసేనకన్నా కమ్యూనిస్టులకే ఎక్కువ లాభం ఉంటుంది.
తాజాగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తాము ప్రజా పోరాటాల కోసం రానున్న రోజుల్లో పవన్ సరసన చేరి ప్రజాపోరాటాలకు సిద్ధమవుతామని ప్రకటించారు.గతంలో ఇదే పార్టీ టీడీపీతో చాలా రోజులు జతకట్టింది.
తర్వాత టీడీపీ…బీజేపీకి దగ్గరవ్వడంతో ఒంటరిగా ఉండిపోయింది.ఇప్పుడు తన ఉనికిని నిలుపుకునేందుకు జనసేనతో పొత్తుకు రెడీ అవుతోంది.
మరి పవన్ కూడా కమ్యూనిస్టు భావజాలం పట్ల ఇష్టంతో ఉంటాడు.మరి 2019లో సీపీఐని కలుపుకుంటాడో ? లేదో ? చూడాలి.







