దిక్కు లేని వారికి దేవుడే దిక్కని అంటారు.ఆయనే తప్పు చేస్తే బాధితులకు దిక్కెవ్వరు? ఇదే భావనతో ఉన్న వైఎస్సార్ సీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఆంద్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని తెలియచేస్తూ పిటిషన్ వేసింది.
వైకాపా లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని కోరినా పట్టించుకోవడంలేదని మేకపాటి పిటిషన్లో పేర్కొన్నారు.జంప్ జిలానీలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు.స్పీకరుకు ఫిర్యాదు చేసి నెల రోజులు దాటిందని, అయినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మేకపాటి చెప్పారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగుతున్నా స్పీకర్లు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోయారు.
వాస్తవానికి పార్టీ ఫిరాయించిన వారు పదవులకు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలి.కేవలం కండువా మార్చుకుంటే పార్టీ మారినట్లు అవుతుందా? కానీ దీన్ని గురించి అడిగే నాధుడే లేడు.సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూడాలి.







