పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణహత్య నుంచి దేశం ఇంకా తేరుకోలేదు.ఎంతో మంచి భవిష్యత్తు వున్న ఈ యువ ర్యాపర్ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంపై పలువురు కంటతడి పెడుతున్నారు.
ఆయన హత్యతో పంజాబ్లో పెరుగుతున్న గన్ కల్చర్, గ్యాంగ్ వార్, రౌడీ రాజకీయాలు, ఖలిస్తాన్ ఉగ్రవాదంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.దీనిని ఇలాగే చూస్తూ ఊరుకుంటే 80వ దశకం నాటి చీకటి రోజులు మళ్లీ పంజాబ్లో ఏర్పడే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిద్దూ మూసేవాలా హత్య తన పనేనంటూ కెనడాలో స్థిరపడిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించాడు.తన మిత్రులు విక్కీ మిద్దుఖేరా, గుర్లాల్ బ్రార్ హత్య కేసుల్లో సిద్దూ ప్రమేయం వుండటంతో.
అందుకు ప్రతీకారంగానే మూసేవాలాను హతమార్చినట్లు గోల్డీ బ్రార్ వెల్లడించాడు.
సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో రాష్ట్రంలో కెనడా గ్యాంగ్ లపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
తాజాగా లూధియానా పోలీసులు కెనడాకు చెందిన సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునేకే నేతృత్వంలోని ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు.వీరి వద్ద నుంచి మ్యాగజైన్లు, క్యాట్రిడ్జ్ లు, ఒక మోటార్ సైకిల్, ఏడు సెల్ ఫోన్లు, రెండు వై ఫై డాంగిల్స్ తో పాటు నాలుగు పిస్టల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
రెండు వారాల క్రితం లూధియానాకు చెందిన వ్యాపారి అజయ్ కుమార్ పై సుఖా ఆదేశాల మేరకు ఆయన ముఠా సభ్యులు కాల్పులు జరిపారు.ఈ ఘటన తర్వాత సుఖా కెనడా నుంచి అజయ్ మామకు ఫోన్ చేసి ‘‘ట్రైలర్ చూపించడానికి తన షూటర్లు అజయ్ పై కాల్పులు జరిపారని.రూ.3 కోట్లు ఇవ్వకపోతే అజయ్ ని చంపేస్తామని హెచ్చరించాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు.అరెస్టయిన వారిలో సమ్రాలాకు చెందిన లఖ్వీర్ సింగ్, మహిల్ ఖుర్ద్కు చెందిన లవ్ప్రీత్ సింగ్, బర్నాలాకు చెందిన హర్వీందర్ సింగ్, సత్నామ్ సింగ్, శుభమ్ అలియాస్ శుభి, పేట సర్పంచ్ అలియాస్ దిల్ప్రీత్ సింగ్, మన్ప్రీత్ అలియాస్ గోలా ఉన్నారని పోలీసు కమిషనర్ కౌస్తుభ్ శర్మ మీడియాకు తెలిపారు.ఇకపోతే.పంజాబ్ లో సుఖా గ్యాంగ్ పై 13 కేసులు వున్నట్లు పోలీసులు చెబుతున్నారు.వసూళ్లు, బెదిరింపులకు ఈ గ్యాంగ్ పాల్పడుతున్నట్లు చెప్పారు.