కెనడాలో( Canada ) దారుణం జరిగింది.28 ఏళ్ల భారత సంతతి యువకుడిని దుండగులు కాల్చి చంపారు.మృతుడిని పంజాబ్లోని లూథియానాకు చెందిన యువరాజ్ గోయెల్గా( Yuvraj Goel ) గుర్తించారు.బ్రిటీష్ కొలంబియాలో జూన్ 7న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
అతని మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.జిమ్లో వర్కవుట్లు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ, యువరాజ్ తన తల్లిలో ఫోన్లో మాట్లాడుతున్నాడు.
తన హౌస్ పార్కింగ్ వద్దకు చేరుకోగానే కాల్ డిస్కనెక్ట్ అయ్యింది.కొందరు వ్యక్తులు యువరాజ్ వద్దకు వచ్చి మీరు ఇక్కడ నివసిస్తున్నారా అని పోలీసులు అడిగినట్లుగా ప్రశ్నించారు.ఇందుకు అతను ఔను అని చెప్పిన మరుక్షణం యువరాజ్పై బుల్లెట్ల వర్షం కురిసింది.కాల్పుల్లో తీవ్రగాయాల పాలైన అతను ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఫోన్ రికార్డింగ్ ఆన్లో ఉందని, క్రైమ్ స్పాట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై అభియోగాలు మోపినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ప్రకటించారు.వీరిని సర్రేకు చెందిన మన్విర్ బస్రామ్( Manvir Basram ) (23), సాహిబ్ బస్రా( Sahib Basra ) (20), హర్కీరత్ జుట్టి( Harkeerat Jutti ) (23), అంటారియోకు చెందిన కెయిలాన్ ఫ్రాంకోయిస్ (20)లుగా గుర్తించారు.వీరిపై కాల్పులు, ఫస్ట్ డిగ్రీ మర్డర్ అభియోగాలు మోపారు.
మృతుడు యువరాజ్ గోయెల్ సర్రేలోని కార్ డీలర్షిప్లో పనిచేస్తున్నాడని అతని సోదరి చారు సింగ్లాను ఉటంకిస్తూ గ్లోబల్ న్యూస్ నివేదించింది.గోయెల్ బావమరిది బవన్దీప్ మాట్లాడుతూ.యువరాజ్ కాల్పుల్లో మరణించడానికి ముందు భారతదేశంలో నివసిస్తున్న తన తల్లితో ఫోన్లో మాట్లాడాడని తెలిపారు.కాల్పులు జరిగిన కొద్దిసేపటికే వాహనంలో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో హోమిసైడ్ యూనిట్ తెలిపింది.
ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది టార్గెటెడ్ షూటింగ్ అని సూచిస్తున్నప్పటికీ ఎలాంటి నేర చరిత్ర లేని యువరాజ్ హత్యకు దారి తీసిన కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.