ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధినేత జగన్మోహన్రెడ్డి తర్వాత కీలక నేతలు ఎవరంటే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అని చాలా మంది చెప్పే మాట.అందుకు తగ్గట్లే వాళ్లకు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.
తన బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీలో ఛైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవిని కూడా జగన్ కట్టబెట్టారు.
గతంలో విశాఖ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను విజయసాయిరెడ్డి నిర్వహించారు.
అయితే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిత్వాలు వేర్వేరుగా ఉంటాయి.విజయసాయిరెడ్డి స్పీడ్గా ఉంటే.
వైవీ సుబ్బారెడ్డి చాలా నెమ్మదస్తుడు అనే పేరుంది.కానీ వైవీ సుబ్బారెడ్డి ఈ పదవిలోకి వస్తూనే కష్టాలను కొనితెచ్చుకున్నారు.
ఆయనకు స్థానిక వైసీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ తనకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
అయితే వాసుపల్లి గణేష్కుమార్ కంటే ముందు నుంచే వైసీపీలో పలువురు నేతలు విశాఖ సౌత్ సీటు కోసం కాసుకుని కూర్చుకున్నారు.
ఇక్కడే కాదు జిల్లాలోని పలు చోట్ల వైసీపీలో వర్గ విభేదాలు వైవీ సుబ్బారెడ్డికి తలనొప్పులుగా మారాయి.అనకాపల్లిలోనూ మంత్రి అమర్నాథ్కు వ్యతిరేకంగా ఉన్న వర్గం వైవీ సుబ్బారెడ్డిని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.మొన్నటివరకు విజయసాయిరెడ్డికి సాన్నిహిత్యంగా ఉన్నవాళ్లు ఇప్పుడు వైవీ పక్కకు చేరేందుకు పావులు కదుపుతున్నారు.
మొత్తానికి విశాఖ రీజియన్లో పార్టీని గెలిపించాలంటే వైవీ సుబ్బారెడ్డి చాలా కష్టపడాల్సి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది.వైసీపీలో గ్రూపులన్నింటినీ ఏకంగా చేయాల్సిన బాధ్యత వైవీపైనే ఉంది.స్థానికంగా వైసీపీ పరిస్థితి పైన పటారం లోన లొటారంగా కనిపిస్తోంది.ఓ వైపు టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వరిస్తూ చుట్టపు చూపుగా విశాఖ వచ్చి వెళ్లాలంటే కుదరని పరిస్థితి ఏర్పడింది.
వైవీ సుబ్బారెడ్డి విశాఖలోనే మకాం వేసి పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.హాయిగా టీటీడీ ఛైర్మన్ పదవిని అనుభవిస్తున్న వైవీకి ఉన్నట్టుండి ఇలాంటి పరిస్థితి ఎదురైందేంటి అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
.