ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించడం లేదు.పెరిగిన బడ్జెట్లకు తగిన విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ సినిమాలకు కలెక్షన్లు రావడం లేదు.
ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి సినిమాలను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఈ పరిస్థితి మారని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు దూరంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.
టాలీవుడ్ హీరోలు బడ్జెట్లను, పారితోషికాలను అంతకంతకూ పెంచితే మాత్రం తాత్కాలికంగా హీరోలు లాభపడినా దీర్ఘకాలంలో భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే పెరిగిన టికెట్ రేట్ల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలో సినిమాలను చూడటానికి దూరమయ్యారు.టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కాస్ట్ ఫెయిల్యూర్స్ జాబితా అంతకంతకూ పెరుగుతోంది.110 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ 97 కోట్ల రూపాయల కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకుంది.
ఆచార్య సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు దాదాపుగా 80 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయని ఇండస్ట్రీలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.సర్కారు వారి పాట సినిమా బ్రేక్ ఈవెన్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఈ సినిమా అసలు కలెక్షన్ల లెక్క మరోలా ఉందని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాస్ట్ కటింగ్ దిశగా నిర్మాతలు అడుగులు వేయని పక్షంలో భవిష్యత్తులో నిర్మాతలు కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.కథను నమ్మి సినిమాలను తీస్తే మాత్రమే ఈ పరిస్థితిలో కొంతమేర మార్పు వచ్చే అవకాశం ఉంది.పెద్ద సినిమాల నిర్మాతలు ఫ్లాపులుగా నిలిచిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.