టెక్నాలజీ 21 వ శతాబ్దంలో కొత్త ప్రపంచాన్ని సృష్టించింది.ప్రస్తుతం అంతా డిజిటల్ యుగానికి మారిపోయింది.
సాంకేతిక పరిజ్ఞానం సమాజంలోని అందరికీ ప్రయోజనం చేకూరుస్తోంది.ముఖ్యంగా భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి.
ప్రతి చిన్న పనికి అందరూ డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు.చిన్న టీ షాపుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్ని చోట్లా బిల్లులను డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేస్తున్నారు.
ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్ల ద్వారా పేమెంట్స్ జరుగుతున్నాయి.ఈ తరుణంలో ఈ డిజిటల్ పేమెంట్స్ కొత్త రూపు సంతరించుకుంది.
విదేశాల్లోనూ ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు చేసేలా సరికొత్త వ్యవస్థ వచ్చింది.ఇండియా-సింగపూర్ మధ్య డిజిటల్ పేమెంట్స్ సులువుగా సాగించేలా కొత్త విధానం అమలులోకి వచ్చింది.
‘క్రాస్-బోర్డర్ కనెక్టివిటీ’ ఈ రోజు నుండి భారతదేశం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ), సింగపూర్లోని ‘పేనౌ‘ మధ్య ప్రారంభం అయింది.యూపీఐ, పే నౌ మధ్య కనెక్టివిటీ రెండు దేశాల మధ్య డబ్బు లావాదేవీని వేగంగా మరియు సులభంగా చేస్తుంది.సింగపూర్లో నివసిస్తున్న భారతీయులు ఇప్పుడు యూపీఐ ద్వారా తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపవచ్చు.ఇది మాత్రమే కాదు, సింగపూర్లో నివసిస్తున్న
ఒక భారతీయుడికి డబ్బు అవసరమైతే, అతను డిజిటల్ చెల్లింపు ద్వారా కూడా డబ్బు అడగవచ్చు.సింగపూర్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు లేదా వలస కార్మికులు ఎక్కువగా దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చు.డిజిటల్ లావాదేవీలలో యుపిఐ కొత్త విప్లవం సృష్టించినట్లు అయింది.
యూపీఐ రాకతో ఇప్పటి వరకు నగదు లావాదేవీలు చాలా సులువుగా, వేగంగా మారాయి.ప్రస్తుతం ఇది దేశం దాటి సింగపూర్ వరకు విస్తరించింది.