సెప్టెంబర్ 16 నుండి 18 వరకు నిర్వహించు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించాలి….రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్సెప్టెంబర్ 16 న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 15 వేల మందితో భారీ ర్యాలీ.
సెప్టెంబర్ 17న ప్రతి జిల్లా కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ ప్రతి జిల్లా నుంచి ఎస్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యులు హైదరాబాద్ తరలింపు సెప్టెంబర్ 18న సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్ర సమరయోధుల సన్మానం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఖమ్మం, సెప్టెంబర్ 7: సెప్టెంబర్ 16 నుండి 18 వరకు నిర్వహించు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవాలు వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డి.జి.పి.మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమ నిర్వహనపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ఈ నెల 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించు కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్ లలో 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని, మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ, జిల్లా అధికారులు, ప్రజలు అందరు ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా రూట్ మ్యాప్ తయారు చేయాలని తెలిపారు.ప్రతి నియోజకవర్గానికి 10 వేల సాధారణ జాతీయ పతాకాలు, 50 పెద్ద జాతీయ పతాకాలు పంపిణీ చేస్తామని, వీటిని ర్యాలీ సందర్భంగా రెపరెపలాడే విధంగా చూడాలని తెలిపారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 15 వేల మంది ర్యాలీ అనంతరం ఒక వేదిక వద్ద చేరుకోవాలని, అక్కడ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, ర్యాలీ లో పాల్గోనే వారందరికి నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు.సెప్టెంబర్ 17న జిల్లా కేంద్రాలలో ముఖ్య అతిథులచే జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని, అదే విధంగా హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ఆదివాసీ భవన్, బంజారా భవన్ లను ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో 1.2 లక్షల ఎస్టీలు పాల్గోనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సెప్టెంబర్ 17న మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లాల నుంచి ఎస్టీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు (గ్రామ వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్ పర్సన్) , ఎస్టీ రైతు బంధు సమితి నాయకులు, ఎస్టీ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు హైదరాబాద్ చేరుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఎస్టీలను హైదరాబాద్ తరలించే సమయంలో మండల హెడ్ క్వార్టర్ నుండి ఆర్టిసీ బస్సుల్లో తరలించాలని, త్రాగునీరు, ఆహర ఏర్పాట్లు చేయాలని, దీని కోసం ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర సమరయోధులను, రచయితలు, కవులు, ప్రముఖ కళాకారులను గుర్తించి సన్మానించాలని, ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 18 వరకు జిల్లాలో ప్రముఖ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ట్రై కలర్ లైటింగ్ తో సుందరీకరించాలని తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర డి.జి.పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో 15 రోజుల పాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల విజయవంతానికి కృషి చేసిన విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది మిగతా శాఖలతో సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలనీ సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.మధుసూదన్, అదనపు డిసిపిలు డా.షబరీష్, ఎస్.సి.బోస్, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.