తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా నిర్వహించనున్నారు.ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ చేయబోతున్నారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కరోనా వైరస్ మార్గదర్శకాల మేరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా భక్తులు లేకుండానే ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేడు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు.ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం చేపడతారు.
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత కీలకమైనది.ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహించడం పరిపాటి.
వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది.
ఇక , నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన అక్టోబరు 16న ఉదయం 9 నుండి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగుతాయి.అక్టోబరు 20న రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు గరుడసేవ జరుగుతుంది.అక్టోబరు 21న మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు వసంతోత్సవ ఆస్థానం, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు కల్యాణ మండపంలో పుష్పక విమానంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిస్తారు.అక్టోబరు 23న ఉదయం 8 గంటలకు స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనసేవ ఉంటుంది.
అక్టోబరు 24న ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఆలయంలోని అద్దాల మండపంలో స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు.