టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో నేటి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టుబోతున్నారు.ఈరోజు ఉదయం 11 తరువాత లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది.
ఈ పాదయాత్రను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ఆ స్థాయిలోనే భారీగా ఏర్పాట్లు చేశారు.చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమయ్యే ఈ యువ గళం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు సాగనుంది.
ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.ఇక పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, చంద్రబాబు కుటుంబ సభ్యులంతా హాజరయ్యేందుకు ఇప్పటికే వారంతా కుప్పంకు చేరుకున్నారు.
దాదాపు 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల లోకేష్ పాదయాత్ర జరగబోతోంది.ఈ యాత్రలో 125 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా రూట్ మ్యాప్ సిద్ధమైంది.

ఇప్పటికే టిడిపి అనుకూల మీడియాతో పాటు , సోషల్ మీడియాలోను యువ గళం పాదయాత్ర కు సంబంధించిన ప్రచారం మొదలైంది.ఇక యాత్ర మొదలైన దగ్గర నుంచి ముగిసే వరకు పెద్ద ఎత్తున ప్రచారం లభించే విధంగా టిడిపి ఏర్పాట్లు చేసింది.ఈరోజు కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద పూజలు ముగించి, 11.03 నిమిషాలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభిస్తారు.ఈ పాదయాత్ర ప్రారంభం కి 175 నియోజకవర్గాల ఇన్చార్జీలు, కీలక నాయకులందరినీ ఆహ్వానించారు.అలాగే 90 మంది స్థానిక నాయకులతో పాటు, టిడిపి అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సుమారు 300 మంది కూర్చునే విధంగా వేదికను ఏర్పాటు చేశారు.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్రకు సంబంధించిన సభ ప్రారంభమవుతుంది.తొలి రోజున జరగబోయే బహిరంగ సభకు దాదాపు 30 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ సభ వ్యవహారాలతో పాటు , లోకేష్ పాదయాత్రకు భారీగానే బందోబస్తును ఏర్పాటు చేశారు.

దాదాపు 200 మంది ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లతో పాటు, మరో 500 మంది వాలంటీర్లను సిద్ధం చేశారు.ఇక పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.చిత్తూరు ఏఎస్పి జగదీష్ ఆధ్వర్యంలో పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి, అలాగే మరో ముగ్గురు డిఎస్పీలు దాదాపు 500 మంది పోలీసులు తొలి రోజులు బందోబస్తు విధుల్లో పాల్గొనబోతున్నారు.
ఈ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయడంతో, లోకేష్ పాదయాత్ర ప్రారంభానికి ముందే ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
