యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ( Government school )సంఖ్య పెంచి పేద,మధ్య తరగతి వారికి నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది.బడిబాటతో సర్కార్ బడులు పిలుస్తుండగా వసతుల లేమితో పరిసరాలు వెక్కిరిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు,సరైన సదుపాయాలు లేకుండా ఉన్నాయని,ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం,కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని,నేడు పాఠశాలలు పున: ప్రారంభమవుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పాఠశాల పరిసర ప్రాంతాలు ఉన్నాయని, ప్రభుత్వం మనఊరు మనబడి కార్యక్రమాలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్ చేయడంలో ఉపాధ్యాయులు విఫలమయ్యారనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.
ప్రైవేట్ పాఠశాలల( Private schools ) ప్రచార హోరుకు ప్రభుత్వ బడులు బేజారవుతున్నాయి.
కాగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కేవలం పిల్లలతో ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు తప్పా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కలిపిస్తున్న వసతులు తల్లిదండ్రులకు వివరించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీంతో ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో మండల,జిల్లా స్థాయి అధికారులు పూర్తిగా విఫలం చెందినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంలో కిందిస్థాయి అధికారులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని,గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యనికి గురైందని,అర్హతలేని వారితో ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ బడులకు కొమ్ముకాయడం మానేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సిపిఎం మండల కార్యదర్శి మద్దెపురం రాజు అన్నారు.