తెలంగాణ కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.ఆ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగా ఎప్పటికప్పుడు అధికారానికి దూరం అవుతుండడంతో పాటు, రోజు రోజుకు పార్టీ బలహీనమవుతోంది.
అయినా ఆ పార్టీలో నాయకుల మధ్య పెద్దగా మార్పు అయితే వస్తున్నట్టుగా కనిపించడం లేదు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధ్య ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటోంది.
ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలు కలుగజేసుకుని నాయకులు సమన్వయం తో పనిచేసేలా చేస్తున్నప్పటికీ , పరిస్థితిలో మార్పు అంతంత మాత్రమే అన్నట్టు గా ఉంది.
ఇక ఈ వ్యవహారం ఇ లా ఉండగానే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినట్టు కనిపించినా, అది తాత్కాలికమే అయ్యింది.
రేవంత్ నాయకత్వంలో పనిచేసేందుకు సీనియర్ నేతలు ఎవరు ఇప్పటికీ ఇష్టపడకపోవడం, ఏ విషయం పైన అయినా అధిష్టానం వద్దే తేల్చుకుంటామంటూ సవాళ్లు విసరడం, మీడియా సమావేశాలు నిర్వహించి మరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ పై బహిరంగంగా విమర్శలు చేస్తున్నా, అధిష్టానం ఈ వ్యవహారాలను సీరియస్ గా తీసుకోకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ లో ఉన్న బలహీనతలను తెలియజేస్తోంది.ఇది ఇలా ఉంటే , ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆ గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ అభ్యర్థి విజయ అవకాశాలను దెబ్బతీస్తాయనే టెన్షన్ రేవంత్ వర్గీయుల్లో ఉంది. ఈ నియోజకవర్గంలో మండలాల వారిగా పార్టీ సీనియర్ నాయకులను ఇన్చార్జిలుగా నియమించినా వారు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని , ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలిచినా, ఆ క్రెడిట్ అంతా రేవంత్ కు వస్తుందనే కారణాలతో సీనియర్లు అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.మునుగోడులో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉన్నా, దానిని సద్వినియోగం చేసుకోవడం లేకపోతున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
ఏం చేసినా రేవంత్ కు కలిసి వస్తుందనే ఆలోచనతో సీనియర్లు దూరంగా ఉంటుండడం వంటివన్నీ తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.

అయితే రేవంత్ మాత్రం ఈ విషయాలను సీరియస్ గానే తీసుకుంటున్నా, మునుగోడులో పార్టీ అభ్యర్థిని గెలిపించి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.అందుకే సీనియర్లు సహకరించినా, సహకరించకపోయిన నిత్యం ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు కీలక నాయకులను కలుసుకుంటూ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలను అందిస్తూ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయానికి కృషి చేయాల్సిందిగా పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నారు.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తేనే రాబోయే ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయని, లేకపోతే మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందనే టెన్షన్ రేవంత్ లోను ఉన్నట్టుగా కనిపిస్తుంది.







