దుబాయ్ గోల్డెన్ వీసా కేవలం సెలబ్రిటీ లకు, పెట్టుబడి దారులకు మాత్రమే పరిమితమని ఇప్పటి వరకూ మనకు తెలుసు కానీ ఈ గోల్డెన్ వీసాను తాజాగా భారత సంతతికి చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడికి ఇచ్చారని తెలియడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.దుబాయ్ గోల్డెన్ వీసా ఇచ్చింది మొదలు ఇప్పటివరకు ఈ వీసాను అందుకున్న వారిలో సెలబ్రిటీ, పెట్టుబడిదారుడు కానీ ఏకైక వ్యక్తి ఈ 16 ఏళ్ల భారత సంతతి యువకుడు కావడం గమనార్హం.
ఇంతకీ కేవలం హై ప్రొఫైల్ ఉన్న వారికే దక్కే ఈ గోల్డెన్ వీసా ఎందుకు మొట్టమొదటి సారిగా ఓ యువ విద్యార్థికి ఇచ్చినట్లు .ఆ వివరాలలోకి వెళ్తే.
భారత్ లోని కేరళ రాష్ట్రానికి చెందిన బషీర్ అనే 16 ఏళ్ల యువ విద్యార్థి దుబాయ్ లోని న్యూ ఇండియా మోడల్ స్కూల్ లో చదువుకుంటున్నాడు.2019 ఏడాది లో తన ప్రాణ స్నేహితుడు స్కూల్ బస్సులో నిద్ర పోతున్న సమయంలో బస్సు డ్రైవర్ విద్యార్థులు ఎవరూ లేరనుకుని బస్సుకు తాళాలు వేసి వెళ్ళిపోయారు.అయితే ఎండలో బస్సు ఉండటంతో పాటు గాలి కూడా ఆడక పోవడంతో అతడు మృతి చెందాడు.తన స్నేహితుడు చనిపోవడంతో బషీర్ తీవ్ర కలత చెంది ఇలాంటి పరిస్థితి ఇకపై ఎవరికి జరగకూడదని భావించి ఇటువంటి సమస్య పరిష్కారానికి ఓ నూతన ఆవిష్కరణ చేశాడు.

బస్సులో ఎవరైననా పిల్లలు ఉండిపోయి డోర్స్ లాక్ చేసిన 30 సెకన్ల లో స్కూల్ యాజమాన్యానికి , అధికారులకు బస్సులో విద్యార్ధి ఉన్నాడని తెలిసేలా ప్రత్యేకమైన టెక్నాలజీని కనుగొన్నాడు.సబీల్ స్మార్ట్ విజిలెంట్ సిస్టమ్ ద్వారా బస్సులో చిక్కుకున్న పిల్లల హృదయ స్పందన , వారి కదలికలను ఈ టెక్నాలజీ క్యాప్చర్ చేసి వెంటనే సంభందిత అధికారులను అప్రమత్తం చేస్తుంది.ఈ టెక్నాలజీ వలన ఎంతో మంది విద్యార్ధులు కాపాడబడుతారని, విద్యార్థులను రక్షించేందుకు తనవంతు కృషి చేశాడని యూఏఈ ప్రభుత్వం బషీర్ ను గోల్డెన్ వీసాతో సత్కరించింది.తన కృషికి గుర్తింపును ఇచ్చిన యూఏఈ ప్రభుత్వానికి బషీర్ కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశాడు
.






