తెలంగాణ ఎన్నికల్లో అనేక సర్వేలు ఎన్నికల ముందు … పోలింగ్ తరువాత తెగ హడావుడి చేశాయి.ఆ పార్టీ గెలుస్తుంది అని ఓ సర్వే సంస్థ ప్రకటిస్తే… కాదు కాదు ఈ పార్టీ గెలవబోతోంది అంటూ మరో సర్వే రిజల్ట్ బయటకి వచ్చింది.
ఇక ఆ తతంగంతో.అంతా ముగిసిపోయింది.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు తెలంగాణాలో మిగిలి ఉన్న ఎన్నికలు ఏవైనా ఉన్నాయా అంటే… అది పంచాయతీ … లోక్ సభ ఎన్నికలు మాత్రమే.
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలను సాధిస్తుంది అనే ఉత్కంఠ అన్ని రకాల వర్గాల్లోనూ ఉంది.
లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే దానిపై జాతీయ మీడియా రిపబ్లిక్ టీవీ తాజాగా… సర్వే నిర్వహించింది.రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మళ్ళీ వస్తాయని అంచనా వేసింది.
మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను టీఆర్ఎస్ 16 స్థానాలు, ఎంఐఎం ఒకటి గెలుచుకుంటాయని ఆ సర్వే తేల్చింది.ఇక టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ఏర్పడిన ప్రజా కూటమికి కూడా ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా రాదనీ ఆ సర్వే తేల్చింది.టీఆర్ఎస్ 42.4 శాతం ఓట్లతో 16 సీట్లను, మిత్రపక్షం మజ్లిస్ 4.7 శాతం ఓట్లతో ఒక్క స్థానం సాధిస్తాయని సర్వే ఫలితాలు వెల్లడించింది.