ఏపీలో నెలకొన్న ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలోనే ఉద్యమించేందుకు సిద్ధం అవుతోంది.ఇందులో భాగంగానే ఇసుక కొరతపై వైసీపీ ఛార్జ్షీట్ పేరుతో మరో కొత్త అస్త్రాన్ని టీడీపీ తెరపైకి తెచ్చింది.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ నాయకులు ఛార్జ్షీట్ను విడుదల చేశారు.ఈ జాబితాలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటూ అనేక మంది కీలక వైసీపీ నాయకులను చేర్చారు.రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా ఇసుక మాఫియాపై అచ్చెన్నాయుడు, ఆలపాటి రాజాలు చార్జిషీట్ ను విడుదల చేశారు.13 జిల్లాల్లో 67మంది వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
టీడీపీ విడుదల చేసిన జాబితా ను ఒకసారి పరిశీలిస్తే తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా, పార్థ సారధి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు.వీరితో పాటూ అనేకమంది నాయకుల పేర్లను ఆ ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.
ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉన్నావైసీపీ నాయకులు ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించారు.ఇసుక అక్రమ రవాణాకు సంబందించిన అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నందునే ఇప్పుడు చార్జిషీట్ విడుదల చేసినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు.
మరి దీనిమీద వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.