టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి సారించారు.ఒకవైపు తన కుమారుడు , టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో యువ గళం పాదయాత్ర చేయిస్తూనే , మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ పర్యటించే విధంగా బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అలాగే ఎక్కడికక్కడ కీలకమైన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి అధికారంలోకి రావాలని, 2024 ఎన్నికల్లో గెలవకపోతే టిడిపి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని పదే పదే పార్టీ నాయకులకు చెబుతూ యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు .అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తూ, అక్కడ బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే వారికి ఏఏ నియోజకవర్గాలు కేటాయించాలి ? అక్కడ టిడిపి టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారిని ఏ విధంగా బుజ్జగించాలి ? వారికి ఏ పదవులు హామీ ఇవ్వాలి అనే విషయంలో బాబు ఒక క్లారిటీ కి వస్తున్నారు.అదేవిధంగా పార్టీలో చేరికల పైన ప్రధానంగా దృష్టి సారించారు.ఇంతవరకు బాగానే ఉన్నా, అసెంబ్లీ కి పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత టిడిపికి లేదు.కానీ ఎంపీ అభ్యర్థుల విషయంలోనే ఆ కొరత తీవ్రంగా ఉంది.ఈ విషయంలో చంద్రబాబు కూడా సీరియస్ గా లేనట్టుగానే కనిపిస్తున్నారు పూర్తిగా ఎమ్మెల్యే అభ్యర్థులపైనే ఫోకస్ పెట్టారు ఎంపీ అభ్యర్థుల విషయంలో అంతగా బాబు దృష్టి పెట్టకపోవడం పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చినా, కేంద్రంలో చక్రం తిప్పాలన్న , ఏపీకి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలన్న, వీలైనంత ఎక్కువమంది ఎంపీలు ఉండాల్సిందే.
అలా ఉంటేనే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లెక్కచేస్తుంది.సరైన గౌరవ మర్యాదలు ఇస్తుంది.అలా కాని పక్షంలో ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు ఈ విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు.ఇక అసెంబ్లీకి పోటీ చేసేందుకు నియోజకవర్గం నుంచి చాలామంది ఆశావాహులు పోటీపడుతున్న, ఎంపీ గా బరిలోకి దిగేందుకు మాత్రం పార్టీ నేతలు ఎవరు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది.2019 ఎన్నికల్లో టిడిపి తరఫున ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగిన చాలామంది ప్రస్తుతం యాక్టివ్ గా లేరు.మరోసారి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే భారీగా సొమ్ములు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండడం, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది కచ్చితంగా అంచనా వేయలేకపోవడం,
ఇప్పటి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తే ఎన్నికల వరకు భారీగా సొమ్ము ఖర్చు పెట్టాల్సి వస్తుందనే కారణాలతో చాలామంది ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదట.2019 ఎన్నికల్లో టిడిపికి విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం లో మాత్రమే ఎంపీ అభ్యర్థులు గెలిచారు.ఇప్పటి వరకు టిడిపి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా గంటా నరహరి మాత్రమే అధికారికంగా ప్రకటించారు.
ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ముందుగానే ఆయన పేరును ప్రకటించారు.కానీ మిగతా పార్లమెంట్ నియోజకవర్గల్లో ఆ పరిస్థితి లేకపోవడంతో బాబు ఎక్కువగా అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించారట.