కృషి వుంటే మనుషులు రుషులవుతారని పెద్దలు అంటూ వుంటారు.ఇలాంటి వారు మన కళ్ల ముందే ఎందరో వున్నారు.
కూటికి గతి లేని స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తిన వారు ఎందరో.ఇదంతా వారికి వూరికే వచ్చేయలేదు.
దీని వెనుక ఎంతో కృషి , పట్టుదల, శ్రమ, అకుంఠిత దీక్ష వున్నాయి.జీవితంలో తాము ఏమి సాధించలేమని కృంగిపోయిన వారికి ఇలాంటి వారు సాధించిన విజయాలు స్పూర్తిగా నిలుస్తాయి.
అలాంటి స్పూర్తి ప్రదాతల జాబితాలోకే వస్తారు కేరళకు చెందిన సురేంద్రన్ కె పటేల్. ఒకప్పుడు బతకడానికి బీడీ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి నేడు అమెరికాలో జడ్జి స్థాయికి ఎదిగాడు.
టెక్సాస్ జడ్జిగా సురేంద్రన్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు.కేరళలోని కాసర్గోడ్కు చెందిన ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించారు.పూట గడవటం కోసం సురేంద్రన్ తన సోదరితో కలిసి బీడీలు చుట్టడానికి వెళ్లేవారు.అలా పదో తరగతి వరకు ఎలాగోలా చదివినా తర్వాత పరిస్ధితి కష్టమైంది.
అయినప్పటికీ చదువుకోవాలన్న లక్ష్యంతో ఓ కళాశాలలో చేరి, మరోవైపు కూలి పనులకు సైతం వెళ్లేవారు.అలా పరీక్షల్లో టాపర్గా నిలిచారు సురేంద్రన్.
తర్వాత కాలికట్లోని గవర్నమెంట్ లా కాలేజీలో చేరి.స్నేహితుల సాయంతో, ఓ హోటల్లో పనిచేస్తూ న్యాయవాద విద్యను పూర్తి చేశారు.
అనంతరం కాసర్గోడ్ జిల్లా హోజ్దుర్గ్ కోర్టులో జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు.తర్వాత ప్రఖ్యాత న్యాయవాది రాజీవ్ ధావన్ పరిచయంతో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.ఈ క్రమంలో శుభతో సురేంద్రన్కు వివాహం జరిగింది.ఆపై వీరిద్దరూ అమెరికాకు వెళ్లారు.ఈ నేపథ్యంలో టెక్సాస్ బార్ ఎగ్జామ్ పాస్ అయిన సురేంద్రన్ 2011లో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.న్యాయవాదిగా అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న ఆయనను ఇటీవలే టెక్సాస్ జిల్లా జడ్జి పదవి వరించింది.
ఇకపోతే కేరళకే చెందిన మహిళా అటార్నీ జూలి ఏ.మాథ్యూ ఇటీవల టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.వరుసగా రెండోసారి ఆమె ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.కేరళలోని తిరువల్లకు చెందిన మాథ్యూ.కాసరగోడ్లోని భీమనడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టులో 3వ నెంబర్కు ప్రెసిడెంట్గా మాథ్యూ నాలుగేళ్లపాటు కొనసాగుతారు.
డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జూలీ.ఈ పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ఆండ్రూ డోర్న్బర్గ్ను 1,23,116 ఓట్ల భారీ తేడాతో ఓడించారు.
.