తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ మధ్య చీకటి ఒప్పందం ఉంది.ఆ ఇరు పార్టీల అధినేతల మధ్య రహస్య ఒప్పందం జరిగింది.
అందుకే పవన్ టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైసీపీ మీద మాత్రమే విమర్శలు చేస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా జనసేన ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి పరోక్షంగా టీడీపీకి మేలు చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నాడని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
తమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ కూడా ప్రత్యర్థే అని, రెండు పార్టీలతోనూ తాము సమాన దూరం పాటిస్తున్నాము అంటూ పవన్ చెప్పుకొస్తున్నారు.
ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్న్యాయంగానే జనసేన ఆవిర్భవించిందని పవన్ చెబుతున్నాడు.
కాకపోతే చాలామంది టీడీపీ నాయకులు బహిరంగంగా పవన్ తమ పార్టీకి మిత్రుడే అంటూ చెబుతున్న మాటలు వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి.ఈ సమయంలోనే చంద్రబాబు, పవన్ తీరు కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.
చంద్రబాబు కూడా మొన్నటి వరకు పవన్ మీద పెద్దగా విమర్శలు చేయలేదు.దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో ఇప్పుడిప్పుడే సుతిమెత్తని విమర్శలు చేస్తున్నాడు.ప్రస్తుతం చంద్రబాబు టార్గెట్ అంతా జగన్ అన్నట్టుగానే ఉంది.పవన్ కూడా అదే దారిలో జగన్ మీద ఫోకస్ పెట్టాడు.
అభ్యర్థుల ఖరారు విషయంలోనూ ఇటువంటి ఆరోపణలే వస్తున్నాయి.
టీడీపీ కీలక నాయకులు పోటీ చేస్తున్న చోట బలహీనమైన అభ్యర్థులను పెట్టడం, అక్కడ ప్రచారానికి పవన్ వెళ్ళకపోవడం, అలాగే పవన్ కి కీలకమైన చోట టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారానికి వెళ్ళకపోవడం అనేక అనుమానాలు పెంచుతోంది.పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరం స్థానాల్లో చంద్రబాబు ఎందుకు ప్రచారం చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.ఈ రెండు స్థానాలూ టీడీపీ సిట్టింగ్ స్థానాలే.
అలాగే నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, బాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గాల్లో పవన్ ఇప్పటివరకు అడుగుపెట్టకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇంకా ప్రచారానికి కొద్ది రోజులే ఉంది కాబట్టి ఈ ఆరోపణలకు చెక్ పెట్టేలా ప్రచారానికి దిగుతారో లేదో చూడాలి.