రాజన్న సిరిసిల్ల జిల్లా :సిడిపి పనుల స్థితిగతుల పై నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సిడిపి పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ( District Collector Sandeep Kumar Jha ) మాట్లాడుతూ, నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల పనులకు సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ద్వారా 51 కోట్ల 85 లక్షలకు పైగా విలువ గల 1833 పనులు మంజూరు చేయడం జరిగిందని, వీటిని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ మొదలగు 18 ఏజేన్సీలకు కేటాయించడం జరిగిందని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి పనులలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 16 కోట్ల 98 లక్షల పైగా ఖర్చు చేసి 738 పనులు పూర్తి చేశామని, 8 కోట్ల 46 లక్షలకు సంబంధించిన 300 పనులు పురోగతిలో ఉన్నాయని, 24 కోట్లు 21 లక్షలకు సంబంధించి 795 పనులు ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు.
క్షేత్రస్థాయిలో పనులు పూర్తయినప్పటికీ యూ.సీ.లు సమర్పించక పోవడం వల్ల ప్రభుత్వ రికార్డులలో పనులు పూర్తి కానట్లు ఉందని,నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి చేసిన పనులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారి, ఏరియా ఆసుపత్రి అధికారి, సంబంధిత అధికారులు వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రస్తుత స్థితిగతుల పట్ల సంబంధిత శాఖలు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో సీపీఓ శ్రీనివాసాచారి, పీఆర్ ఈఈ భూమేష్, సెస్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ రమేష్ కుమార్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథ్ తదితరులు పాల్గొన్నారు.