ఇండియన్ రైల్వేలో ఆహార విషయమై తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది.ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట చేదు అనుభవాన్ని పొందుతూ ఉంటాడు.
సోషల్ మీడియా బాగా ప్రబలడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఆహారంలో పురుగులు ఉన్నాయని, బల్లి పడిందని, బొద్దింకలు లాంటి అనేక రకాల కీటకాలు వస్తున్నాయని వచ్చిన సందర్భాలు ఎన్నో చూశాం, చదివాం.
ఈ క్రమంలో ఇండియన్ రైల్వే ఆమధ్య అలెర్ట్ అయ్యి, రైళ్లలో ఆహారం వండే సిబ్బందికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది.అలాగే ఇటీవల ఓ మెనూ కూడా రిలీజ్ చేసింది.
అయితే అలాంటి ఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరం.అవును, తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.తన రెండున్నరేళ్ల చిన్నారి కోసం ఒక రైల్వే ప్రయాణికుడు ఎక్స్ట్రా ఆమ్లెట్ ఆర్డర్ చేయగా ప్యాక్ విప్పి చూసి షాక్ అయ్యాడు.విషయం ఏమంటే ఆమ్లెట్ మడతల మధ్య ఓ బొద్దింక కనిపించింది.
దీంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి ఈ విషయాన్ని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రైల్వే శాఖ మాజీ మంత్రి అయినటువంటి పీయుష్ గోయల్, రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్తూ ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
కాగా ఈ విషయం IRCTCని మరోసారి తీవ్ర విమర్శల పాలయ్యేలా చేసింది.రాజధాని ఎక్స్ప్రెస్ రైల్లో డిసెంబర్ 16న ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ సందర్భంగా బొద్దింక ఉన్న ఈ ఆమ్లెట్ తిని తన కూతురికి ఏమైనా జరిగి ఉంటే.
అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని కొంచెం ఘాటుగానే ప్రశ్నించారు.దీనికి నెటిజన్లు స్పందిస్తూ నాణ్యమైన ఆహారం అందించడంలో IRCTC విఫలం అవుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రైళ్లలో నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలం అయితే ఆర్థికంగా ఆ నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఒక ట్విటర్ యూజర్ డిమాండ్ చేయడం విశేషం.