ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ వైఖరి చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.మొన్నటి వరకు బీజేపీ తో సన్నిహితంగా జగన్ మెలిగారు.
ఏపీ ప్రయోజనాలకు అడ్డు పడుతూ వచ్చినా, తాము కోరిన డిమాండ్లు నెరవేర్చకపోయినా, కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి జగన్ మద్దతు పలుకుతూ, కీలకమైన బిల్లులు పాస్ అయ్యే విధంగా వైసీపీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొంటూ వస్తున్నారు.అయితే ఏపీ పరిస్థితి ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉంది.
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన సొమ్ముల కోసం నెలనెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే ఈ అప్పులపై కేంద్ర అధికార పార్టీ బిజెపి కొర్రీలు పెడుతూ, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.
జగన్ బీజేపీతో స్నేహం కంటే శత్రుత్వాన్ని కోరుకుంటున్నట్లుగా బిజెపి పెద్దల అభిప్రాయం పడడమే కారణంగా తెలుస్తోంది.దీనికి కారణం కూడా ఉంది.వైసిపి రాజకీయ వ్యూహకర్తగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు సహాయం అందించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కాంగ్రెస్ కు వ్యూహకర్తగా అనధికారికంగా నే వ్యవహరిస్తున్నారు.త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నిటిని ఏకం చేసి రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా చేసుకున్నారు.అయితే ప్రశాంత్ కిషోర్ సూచనలతో నిన్న మొన్నటి వరకు బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన జగన్ ఇప్పుడు ఆ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.
వాస్తవంగా కొద్ది నెలల క్రితం భర్తీ చేసిన కేంద్ర క్యాబినెట్ లో వైసిపికి దాదాపు కొన్ని మంత్రి పదవులు డిసైడ్ అయిపోయాయి.అయితే తాము ఆ పదవులను తీసుకోవడం లేదంటూ జగన్ బీజేపీ పెద్దలకు చెప్పారట.అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ అన్నట్లుగా తెలుస్తోంది.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన ఒత్తిడితోనే జగన్ ఇప్పుడు బిజెపికి దూరం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.