సూర్యాపేట జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలో రోడ్ నిర్వహించారు.అనంతరం పొట్టి శ్రీరాములు సెంటర్ లో ఆయన మాట్లాడుతూ బీసీల కోసం పనిచేసే బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.నీళ్ళు, నిధులు,నియామకాల సాధనకు జనసేన పాటుపడుతుందన్నారు.
2008లో జనసేన పార్టీ పెట్టడానికి మూల కారణం నల్లగొండ జిల్లా అన్నారు.ఆ రోజు తమ్ముడు సినిమా విజయవంతానికి వచ్చినప్పుడు ఫ్లోరోసిస్ బాధితుల పరిస్థితి తనను కలచివేసిందని,2009లో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ గ్రామాల్లో తిరిగి వాటర్ ప్లాంట్స్ పెట్టేందుకు ముందుకు వస్తే స్థానిక రాజకీయ శక్తులు అడ్డుకున్నాయన్నారు.అత్యధికంగా ఉన్న బీసీలు రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని,తనపై ప్రభావం చూపింది గద్దర్ మాటలేనని,ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు కలిస్తే తెలంగాణ గాయపడిందని,యువత, మహిళలకు భద్రత కరువైందని,నువ్వు నిలబడాలని చెప్పడంతో రాజకీయ ప్రస్తావన ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు.
ఎరుపు మార్పుకు విప్లవానికి చిహ్నం,కాషాయం సనాతన ధర్మానికి గుర్తు అన్నారు.రెండింటినీ కలిపి కులమతాలకు అతీతంగా పాలన చేస్తున్న మోడీకి మద్దతుగా జనసేన తరుపున మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో యువతకు మహిళలకు భద్రతలేదని డబలు ఇంజన్ సర్కారు దిశగా జనసేన కృషి చేస్తుందని, దశాబ్ద కాలంగా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని జనసేన నిలబడిందని, తోచినంత ప్రజాసేవ చేయడానికి నిశ్చయించుకుని జనసేనతో రాజకీయ ఆరంగేట్రం చేశానన్నారు.
తాము రాష్ట్రవ్యాప్తంగా బీజేపీతో కలిసి 100 స్థానాల్లో పోటీలో ఉండగా జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీలో ఉందన్నారు.
సూర్యాపేట జిల్లాలో బరిలో ఉన్న బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు సంకినేని వెంకటేశ్వరరావు (బీజేపీ-సూర్యాపేట), మేకల సతీష్ రెడ్డి (జనసేన-కోదాడ), కడియం రామచంద్రయ్య (బీజేపీ-తుంగతుర్తి),చల్లా శ్రీలత రెడ్డి(బీజేపీ – హుజూర్ నగర్) లకు మద్దతు పలికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.మీ ప్రేమ,భారీ స్వాగతం మన అభ్యర్ధులను గెలిపించుకోవడంలో చూపిస్తే తిరిగి ఇదే చోట మళ్లీ కలుసుకునేందుకు వస్తానని,తెలంగాణ నేలతల్లికి జేజేలు అంటూ పర్యటన ముగించారు.