యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ యాదాద్రి ఆలయ సమీపంలోని సురేంద్రపురిలో జూన్ 1 పంచముఖ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ నరసింహారావు తెలిపారు.శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ చైర్ పర్సన్ కుందా ప్రతిభ,కంచి కామకోటి పీఠం ధర్మాధికారి జయశంకర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో జూన్1న హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు.
ఉదయం 5:30 నుండి పూజా కార్యక్రమాలు జరుగుతాయని, 11:30 కి సువర్చలపంచముఖ హనుమాన్ కళ్యాణం, హనుమాన్ మాల విరమణ, మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల వరకు అన్నప్రసాద కార్యక్రమం, సాయంత్రం భక్తుల సమక్షంలో సురేంద్రపురి సృష్టికర్త కుందా సత్యనారాయణ విగ్రహావిష్కరణ,సాయంత్రం శ్రీ సువర్చలా పంచముఖ హనుమాన్ స్వామివారి ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు,గుస్సాడి నృత్యం,కోలాట భజనలు ఉంటాయన్నారు.బాణాసంచా వెలుగులలో స్వామి వారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రావణ్ కుమార్ చార్యులు, మృత్యుంజయ తదితరులు పాల్గొన్నారు.