భారత జాతిపిత మహాత్మా గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూలపై ప్రశంసల వర్షం కురిపించారు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ క్యాథీ హోచుల్.ప్రఖ్యాత క్వీన్స్ మ్యూజియంలో ఇండో అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు.
గాంధీ, నెహ్రూ వంటి భారతీయ నాయకులు చూపిన ప్రజాస్వామ్యం, అహింస వంటి అంశాలపై డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సహా ఇతరులకు స్పూర్తిగా నిలిచారని గవర్నర్ కొనియాడారు.ఇదే భారత్ – అమెరికాలను ఒకదానితో ఒకటి ముడివేశాయని క్యాథీ హోచుల్ అన్నారు.
వలస పాలన నుంచి భారత్ విముక్తి పొంది 75 సంవత్సరాలు గడిచిందని.స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి ఇండియా నిజమైన ప్రజాస్వామ్యం వైపు ప్రయాణించిందని హోచుల్ పేర్కొన్నారు.
అమెరికా కూడా వలస పాలనను తిరస్కరించడం, ప్రజాస్వామ్యాన్ని స్వీకరించడం, సమానత్వం, వాక్ స్వాతంత్య్రం, మత స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య విలువలపై భాగస్వామ్య అవగాహనతో స్థిరంగా వుందన్నారు.
అహింస అంటే ఏమిటో తెలుసుకోవడానికి తనను ప్రేరేపించిన గాంధీ, నెహ్రూ వంటి భారతీయ నాయకులను మార్టిన్ లూథర్ కింగ్ తరచుగా ఉటంకిస్తూ వుండేవారని క్యాథీ హోచుల్ పేర్కొన్నారు.
భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకున్న తొలి న్యూయార్క్ గవర్నర్గా నిలిచినందుకు గర్వంగా వుందన్నారు.
అంతకుముందు ‘‘నమస్తే’’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన క్యాథీ హోచుల్ ‘‘జైహింద్’’ అని ముగించారు.ఆగస్ట్ 15, 2022 భారత స్వాతంత్య్ర దినోత్సవం అధికారికంగా ప్రకటించబడుతుందని చెబుతూ… దీనికి సంబంధించిన ప్రకటన పత్రాన్ని న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్కు ఆమె అందజేశారు.