ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లో ప్రకంపనాలు రేపుతూనే ఉంది.ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ కవితకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావలసిందిగా ఆ నోటీసులు పేర్కొనడంతో, కవిత ఈ వ్యవహారం పై స్పందించారు .
ఈ మేరకు ఈడి అధికారులకు కవిత లేఖ రాశారు.గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా, నేరుగా ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా పిలవడం వెనుక కారణాలు ఏమిటి అని ఈడి అధికారులకు రాసిన లేఖలో కవిత ప్రశ్నించారు.
తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈనెల 11న విచారణకు హాజరవుతానని ఆమె స్పష్టం చేశారు.ఈ మేరకు నిన్ననే ఈడి జాయింట్ డైరెక్టర్ కు లేఖ రాశారు.తనకు ముందస్తు అపాయింట్మెంట్లు , కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన విచారణకు హాజరు కాలేనని ఆమె తేల్చి చెప్పారు.అసలు ఇంత స్వల్ప సమయంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం వెనుక కారణాలు ఏమిటో తనకు అర్థం కావడం లేదని కవిత లేఖలో పేర్కొన్నారు.
దర్యాప్తు పేరుతో రాజకీయం చేస్తున్నారన్నట్లుగా కవిత విమర్శించారు.
ఒక సామాజిక కార్యకర్తగా వారం ముందే తన కార్యక్రమాలు ఖరారు అయ్యాయని, కాబట్టే 11వ తేదీన విచారణకు హాజరవుతానని కవిత ఇప్పటికే పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు కవిత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా , ఈడి నోటీసులపై కవిత స్పందించబోతున్నారు.
అయితే కవితను ఈడి అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటే ముందస్తుగా బెల్ తీసుకునే విషయం పైన బీఆర్ఎస్ లీగల్ సెల్ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ నోటీసులు , రేపు మహిళా బిల్లు రిజర్వేషన్ అంశం పైన ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తి రేపుతోంది.