యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో మిగ్ జామ్ తుపాను( Cyclone Michaung ) దృష్ట్యా రానున్న మూడు రోజులు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే ( Hanumant Kondiba )ఆదేశించారు.
జిల్లా కేంద్రం నుండి ఎమ్మార్వోలు,ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లు, ఇరిగేషన్,రోడ్లు,భవనాల శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా వర్షాలకు తీసుకోవాల్సిన ఏర్పాట్లు, జాగ్రత్తలపై పలు ఆదేశాలు జారీ చేశారు.లోతట్టు ప్ర్రాంతాలను గుర్తించి సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని,పాత గోడలు,శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని,చెరువుల వద్ద పరిస్థితులను పరిశీలించి, గండ్లుపడే చోట్లను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని,కల్వర్టులు, రోడ్లపై,బ్రిడ్జిలపై నీరు ప్రవహించే చోట్ల రాకపోకలకు అనుమతించవద్దని,పోలీసుల సమన్వయంతో బ్యారికేడింగ్,బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.
గ్రామాలలో,మున్సిపాలిటీ వార్డులలో ఇండ్ల మధ్య నీరు నిలిచి పోకుండా ఉంటే చర్యలు చేపట్టాలన్నారు.
ముఖ్యంగా మూసీ ( Musi River )పరివాహక మండలాలైన బీబీనగర్, భువనగిరి,వలిగొండ, పోచంపల్లి,రాజపేట పరిథిలోని గ్రామాలలో క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి అంతరాయం,నష్టం కలుగకుండా చూసుకోవాలని, అధికారులెవరూ వారి హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని,తమ తమ టీములతో 24 గంటల నిఘా ఉంచాలన్నారు.వర్షాల కారణంగా వచ్చే ఇబ్బందులను అధిగమిస్తూ శానిటేషన్ పనులను నిర్వహించాలని సూచించారు.
రెవిన్యూ,పంచాయితీ,మున్సిపాలిటీ,పోలీసు,నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో ఎలాంటి నష్టం జరుగకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రతి మూడు గంటలకు ఒక సారి నివేదికలు పంపాలని ఆదేశించారు.







