ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రం అస్సాం లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో అక్కడ వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది.
కమ్యూనికేషన్ సర్వీసులు, రైల్వే మార్గాలు, రహదారులు అన్నీ కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి.అయితే ఈ బీభత్సానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే అస్సాంలోని వరద ప్రవాహంలో ఒక వ్యక్తి పరుపు వేసుకుని హాయిగా పడుకున్నాడంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది.
నిజానికి ఈ వీడియో అస్సాంకి చెందినది కాదు.
ఈ ఘటన భారతదేశంలో చోటు చేసుకోలేదు. మలేషియాలోని జోహార్ బహ్రులో జనవరి 2021 వరదల సమయంలో దీనిని చిత్రీకరించారు.
వైరల్ అవుతున్న వీడియోలో మీరు ఒక వ్యక్తి పరుపుపై పడుకొని నిద్రించడం చూడొచ్చు.ఇదే వీడియో ఇప్పుడు మన ఇండియాలో వైరల్ అవుతుంది.
దీనిని చూసి నెటిజనులు అవాక్కవుతున్నారు.ఇదేందయ్యా ఇది, ఇలాంటి దృశ్యాన్ని ఎక్కడా చూడలే అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ముహమ్మద్ ఫారిస్ సులైమాన్. 2021 లో వచ్చిన వరదల కారణంగా సులైమాన్ ఇల్లు మునిగిపోయింది.దీంతో కోపంతో అతడు బయటే నిద్రించాడు.అతడు అలా నిద్రపోతుండగా తన తల్లి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.అది కాస్తా వైరల్ అయ్యింది.అయితే ఇదే వీడియోని అస్సాంలో జరిగినట్లుగా కొందరు కావాలనే ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
అస్సాంలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు మాట్లాడుతూ, దక్షిణ అస్సాంలోని కాచర్ జిల్లాలో వరదల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపారు.అయితే డిమా హసావో, లఖింపూర్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 20 జిల్లాలు జలమయమయ్యాయి.