జేడీ లక్ష్మీనారాయణ ! తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.సిబిఐ అధికారి గా జేడీ లక్ష్మీనారాయణ పనిచసిన సమయంలో, జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన వ్యవహరించిన తీరు ఆయనకు ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆయనను హీరోను చేశాయి.తాను పనిచేసిన హోదాని ఇంటిపేరుగా జనాలు పిలిచే అంతటి స్థాయికి లక్ష్మీనారాయణ పేరు సంపాదించుకున్నారు.
ఇక ఆ తర్వాత కొంత కాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.రకరకాల పార్టీల పేర్లు మొదట్లో ప్రచారంలోకి వచ్చినా, ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేశారు.
అక్కడ గట్టిపోటీ ఇచ్చినా, ఆయనకు ఓటమి తప్పలేదు.ఆ తరువాత జనసేన కు రాజీనామా చేసిన జేడీ అప్పటి నుంచి రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూపులు చూస్తూనే వస్తున్నారు.
అసలు జేడీ జనసేన లో కి వెళ్లడమే పెద్ద మైనస్ అనేది అందరి అభిప్రాయం.అదే బీజేపీ నుంచి కానీ, టీడీపీ నుంచి పోటీ చేసినా, ఆయన గెలిచి ఉండే వారు అనే సానుభూతి ఇప్పటికీ జనాల్లో ఉంది.ప్రస్తుతం ఆయన ఏ రాజకీయ పార్టీలో లేకపోయినా, జనాల్లో ఆయనపై సానుభూతి ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు జేడీ మనసు బీజేపీ వైపు లాగుతోందట.అసలు 2019 ఎన్నికలకు ముందే బీజేపీలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేద్దామని చూసినా, టికెట్ విషయంలో ఆ పార్టీ నుంచి హామీ లభించకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు.ఇక ఇప్పుడు బీజేపీ నే ఆయన కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
అయితే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అప్పట్లో జె.డి ప్రయత్నించారని, అది దక్కకపోవడంతో కనీసం రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పిస్తారని భావించినా అది దక్కకపోవడంతో సైలెంట్ గానే ఉండిపోయారు.
త్వరలోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి జేడీ తో భేటీ అవ్వడంతో జేడీ బీజేపీలో చేరడం ఖాయం అయిపోయిందని , తిరుపతి ఉప ఎన్నికలకు ముందు జేడీ బీజేపీలో చేరిపోతారని, తిరుపతి ఉప ఎన్నికల ప్రసారానికి బీజేపీ జేడీ లక్ష్మీనారాయణ రంగంలో దింపుతుందనే ప్రచారం ఇప్పుడు నడుస్తోంది.
అయితే ఆయన ఛరిష్మాకు తగిన పదవి ఏది ఇస్తారు అనేది తేలాల్సి ఉంది.