జనసేన, పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తకుండానే తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటారు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ వైసీపీ పైన, జగన్ పైన విమర్శలు చేస్తున్నా, జగన్ పెద్దగా పట్టించుకునేవారు కాదు.
అయితే కొద్ది రోజులుగా ఆ విమర్శల డోసు పెరుగుతూ ఉండడంతో పాటు, దత్తపుత్రుడు అంటూ ప్రస్తావిస్తూ అనేక విమర్శలు చేస్తున్నారు.తాజాగా ఇదే విధమైన వ్యాఖ్యలు జగన్ చేశారు.
వైఎస్సార్ కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న జగన్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు లో దీనిపై మాట్లాడారు.కాపు నేస్తమే కాదు కాపు కాస్తమని జగన్ తెలిపారు.
వరుసగా మూడో ఏడాది కాపు నేస్తాన్ని అమలు చేస్తున్నామని జగన్ ఈ సందర్భంగా చెప్పారు.తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1600 కోట్ల రూపాయలకు పైగా కాపు నేస్తం పేరుతో మహిళలకు అందించామని జగన్ తెలిపారు.
ఈ పథకం ద్వారా దాదాపు మూడు లక్షల మందికి పైగా లబ్ది పొందారని వివరించారు.తాము పారదర్శకతతో పథకాలు అర్హులకు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.కానీ గత ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిన డబ్బు కూడా ఖర్చు చేయలేదని, కులం ,మతం , పార్టీ , ప్రాంతం అనే బేధం లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జగన్ చెప్పుకొచ్చారు.గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు చెప్పిన వారికి ప్రభుత్వ పథకాలు అందాయని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఈ తేడాను జనాలు గమనించాలని జగన్ కోరారు.

చంద్రబాబు తన దుష్ట చతుష్టయం , దత్త పుత్రుడు బాగుపడే పాలన కావాలా లేదా అన్ని సామాజిక వర్గాలకు లబ్ధి చేసే ప్రభుత్వం కావాలో మీరే ఆలోచించుకోవాలని జగన్ జనాలను కోరారు.చంద్రబాబుకు మళ్ళీ ఓటేస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారని విమర్శించారు.కాపుల ఓట్లను కొంత మూటగట్టి హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేసేందుకు దత్తపుత్రుడు రాజకీయాలు చేస్తున్నాడని జగన్ విమర్శించారు.







