త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటుతుండడంతో తమ పరిపాలనపై ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో ఒక సామాన్య వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసి గెలిపించడంపై మంచి ఉత్సాహంగా జగన్ ఉన్నారు.అయితే ఆ తరువాత అనేక ప్రతికూల పరిణామాలు ఏర్పడడం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే సంకేతాలు వస్తుండడం తదితర కారణాలతో ఉప ఎన్నికలకు వెళితే వాస్తవ పరిస్థితి ఏమిటనేది తెలుసుకునేందుకు వీలు అవుతుందనేది జగన్ ఆలోచనగా ఉందట.
ఇప్పటికీ ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కష్టమైపోతుంది.
ఈ తరుణంలో జగన్ ఉప ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు చేస్తుండడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఇటీవలే బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి.
ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పై తృణమూల్ కాంగ్రెస్ ఒత్తిడి చేస్తోంది.
మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి ధోఖా లేకుండా ఉండాలి అంటే ఉప ఎన్నికలలో తప్పనిసరిగా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి.నవంబర్ 4వ తేదీ లోగా ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే ఆమె పరువుకు ఏ డోఖా ఉండదు.
ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం పై మమత ఒత్తిడి చేస్తున్నారు.దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరగబోయే సాధారణ ఎన్నికలతో పాటు, ఉప ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది.
దీంతో ఏపీలోనూ ఉప ఎన్నిక అనివార్యం కాబోతోంది.టీడీపీ నుంచి వైసీపీ లో చేరకుండానే అనుబంధ సభ్యుడుగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాల గిరి వంటివారితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించి, మళ్లీ వైసీపీ తరుపన పోటీ చేయించాలనే ఎత్తుగడలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
దీని ద్వారా వివిధ ప్రాంతాల్లో వైసిపి కి ఎంత వరకు పట్టు ఉంది అనేది తేలడంతో పాటు, అధికారికంగా టిడిపి నుంచి వచ్చిన వారిని వైసీపీలో చేర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు వెళ్లడం అంత మంచిది కాదని, బద్వేల్ ఉప ఎన్నిక వరకు అయితే పర్వాలేదు కానీ, టిడిపి నుంచి వచ్చిన వారి కోసం , వారి రాజీనామాలను ఆమోదించి ఉప ఎన్నికలకు వెళ్లడం అంత మంచిది కాదు అనే అభిప్రాయం వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.మరి జగన్ ఈ విషయంలో మనసు మార్చుకుంటారో లేదో.