జగన్ పూర్తిగా సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు.సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువ అయితే ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని జగన్ బలంగా నమ్ముతున్నారు.
అందుకే ఏపీ ఆర్థిక పరిస్థితి సహకరించక పోయినా ,సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు.కరోనా సమయంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా జగన్ పథకాల కోసం సొమ్ములు వెచ్చిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పైన చర్చ జరిగేలా చేసుకుంటున్నారు.మొదట్లో అసాధ్యమనుకున్న పథకాలను సైతం జగన్ అమలు చేసి చూపించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ వస్తున్నారు.
అయితే కేవలం సంక్షేమ పథకాలే జగన్ పార్టీని గట్టేక్కిస్తాయా అంటే అనుమానమే.మొత్తం ఏపీ బడ్జెట్ అంతా ఈ పథకాల కోసం ఖర్చు పెడుతూ ఉండడం తో మిగిలిన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పెండింగ్ లో పడిపోతున్నాయి.
జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది.ఇప్పటికీ సంక్షేమ పథకాలు తప్ప మిగతా అభివృద్ధి పనులు పెద్దగా ఎక్కడ జరిగినట్లుగా కనిపించలేదు.ఇక ఈ మూడేళ్ల పాలనలోనూ జగన్ సంక్షేమ పథకాలు కోసమే ఎక్కువగా నిధులు విధులు కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది.అయితే పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి చెందుతారా అంటే అది అనుమానమే.
ఎందుకంటే పథకాలు మళ్లీ ఎన్నికల నాటికి పాత పడిపోతాయి.మళ్లీ కొత్త పథకాల కోసం, మరిన్ని ఉచిత పథకాల కోసం జనాలు ఎదురుచూస్తూ ఉంటారు .అప్పుడు ఇవే సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసుకున్నా జనాలు పెద్దగా పట్టించుకోరు.
మళ్లీ ఎన్నికల సమయంలో సరికొత్త ఉచిత పథకాలను ప్రకటించాల్సిందే.ఈ లోపు కాస్తో కూస్తో ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది.ఇలా ఏ లెక్కన చూసుకున్నా, జగన్ పూర్తిగా సంక్షేమ పథకాలనే నమ్ముకుంటే రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు.