గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన పార్టీని ఎలాగైన ఈ సారి అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు .కానీ ఈ క్రమంలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకమైన పోరాటం కంటే సానుభూతిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నట్లు ఇటీవల కాలంలో ఆయన వ్యవహారశైలిని బట్టి అర్ధమవుతుంది .
రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు తాను గెలిస్తే ప్రజల అదృష్టం అన్నట్లు, ఓడితే ప్రజల దురదృష్టమన్నట్లుగా వ్యవహరించడం దురదృష్టకరం .ఈ తరహ వ్యవహరశైలి వల్ల గతంలోనూ , 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు తగిలి పార్టీకి గాయాలైనా ఆయన వ్యవహరశైలిలో మార్పు రాకపోవడం తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తిని మిగుల్చుతుందనే టాక్ వినిపిస్తోంది .‘నాకు 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు.అపుడు నన్ను గెలిపించి పంపితేనే నేను రాజకీయాల్లో ఉంటాను ‘ అంటూ కర్నూలు జిల్లా పర్యటనల్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి .ఈ వ్యాఖ్యలు అధికారం కోసం సానుభూతిని కూడగట్టుకొనేందుకా ? లేక 72 సంవత్సరాల వయస్సులో ఉన్న తాను 2024 ఎన్నికల్లో సరైన ఫలితం రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు చేసిన వ్యాఖ్యలా అనే అంశంపై పలుచోట్ల చర్చ కూడా జరుగుతుంది.
చంద్రబాబు రాజకీయ జీవితాన్ని తరచిచూస్తే అధికారం కోసం ఎటువంటి అవకాశాన్ని వదులుకొని మనస్తత్వం ఉన్న నేతగా అందరికి తెలుసు.
తాజాగా చేసిన వ్యాఖ్యలు సానుభూతితో ప్రజలమనస్సును గెలుచుకొనే ప్రయత్నంలో భాగంగానే చివరి అస్త్రంగా తనకు ఆఖరి ఎన్నికలంటూ కొత్త స్లోగన్ ఎన్నుకోవడం వ్యూహత్మకమే అంటున్నారు రాజకీయ పండితులు .ఈ స్లోగన్ ను క్రమక్రమంగా వచ్చే ఎన్నికల నాటికి విస్త్రతంగా ప్రచారం చేయడంలోనూ, చంద్రబాబు పదేపదే ప్రస్తావించే సందర్భం కూడా ఏపీ రాజకీయ యవనికపై ఇక తరచుగా వినిపించే, కనిపించే దృశ్యం కావచ్చు .ఒకవైపు తన వయసైపోయిందని కొంతమంది ఎగతాళి చేస్తున్నారని తాను ఫిట్ గా ఉన్నానని చెబుతూనే…వచ్చే ఎన్నికలు తనకు ఆఖరి ఎన్నకలంటూ మాట్లాడటంలో ఉన్న ఆంతర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహిస్తున్నారనే విషయం ముందుగా ఆయన తెలుసుకోవాల్సి ఉంది.సానుభూతితో ఓటర్లను తమవైపు తిప్పుకుని అధికారానికి చేరువ కావాలనే ఆలోచన చంద్రబాబుకు ఉంటే ముందుకు తనకు అనుభవమైన 2003 సంవత్సరం అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ఘటన ను గమనంలోకి తీసుకోవాలి.
ప్రాణాపాయ పరిస్ధితి నుండి బయటపడి ఆ సానుభూతితో 2004 ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు వెళ్లినా వచ్చిన ఫలితం ఏంటో చంద్రబాబు ఆలోచన చేయాల్సిన సందర్భం ఇది.

గెలుపుబాటకు అధినాయకుడి సమర్ధత గీటురాయి అవుతుందా లేక సానుభూతే పదవిని తెచ్చుపెడుతుందా అనే అంశం చంద్రబాబుకు తెలియనిది కాదు .ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యధికశాతం సమర్ధతతోనే పార్టీలు అధికారంలోకి వచ్చాయి .ఆ మాటకొస్తే చంద్రబాబు కూడా 2014 ఎన్నికల్లో సైకిల్ పార్టీని అధికారంపైపు నడిపించడంలో పొత్తుల వ్యూహాలు, కొత్త రాష్ట్రానికి తన సీనియార్టి అవసరం అంటూ చేసుకున్న ప్రచారం ఎటువంటి సత్ఫలితాన్ని ఇచ్చిందో చెప్పనక్కర్లేదు.తాను గెలవకపోతే ప్రజల దురదృష్టం అనుకునే భావన నుండి ముందు చంద్రబాబు బయటపడాలి .ప్రాధేయపడటం కంటే పోరాటమే శరణ్యమనే ఆలోచన చేసి అమలు చేయడం ఆయన ముందున్న కర్తవ్యంగా భావించాలి.గతంలో మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి , కరుణానిధి లాంటి నేతలు ఓటమి పాలైనా ఏనాడు సానుభూతి ప్రాపకంతో ప్రజల ముందుకెళ్ళే ప్రయత్నాలు చేయలేదు.1969 ఎన్నికల విజయం తర్వాత వరుసగా 1977,1980,1985లో డీఎంకే ఓటమి పాలైన కరుణానిధి దిగులుపడలేదు.చివరికి 1989 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేవరకు ప్రజాసమస్యలనే అస్త్రాలుగా చేసుకొని డీఎంకే కు పూర్వవైభవం కరుణానిధి తీసుకొచ్చారు.ఆ మాటకొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లోని అత్యంత కీలకనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తగిలిన ఎదురుదెబ్బలు సామాన్యవైనవి కాదు.

1999 ఎన్నికల్లో తానే సూపర్ లీడర్ గా ఎన్నికల రణరంగంలో పోరాటం చేసి ఓటమి పాలైనా నిరాశ చెందక ప్రజా ఉద్యమాలతోనే పోరాటం చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో భవిష్యత్ లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసారు.సానుభూతి తో కాకుండా తన రాజకీయ అనుభవాన్ని రంగరించి పోరాటం చేసి గెలిచి ఈనాటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది .ప్రస్తుతం కూడా కొనసాగుతుంది .ఆ ప్రాంతంలో సంగిశెట్టి వీరభద్రరావు అనే నాయకుడు ఉండేవారు .ఆయన ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటం చేసేవారు.కానీ గెలుపు తీపి ఆయన దరికి చేరలేదు .చివరికి 1999 ఎన్నికల్లో సంగిశెట్టి వీరభద్రరావు ఇండిపెండెంట్ గా పోటీచేసి ….”ఓట్లు వేసి అసెంబ్లీకి పంపండి లేదా స్మశానానికి పంపండి “ అనే వినూత్న ప్రచారంతో ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీలను ఓడించి గెలుపు కైవసం చేసుకున్నారు .ఇది సానుభూతే కానీ …ఆ నాయకుడు ప్రజలతో మమేకమైన తీరు , ప్రజా సమస్యలపై చేసిన ఆందోళనలే ఆయన గెలుపుకు బాటలు వేసాయి .రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకమైన పోరాటాలను క్షేత్రస్ధాయిలో చేపట్టకుండా ,అధికార పార్టీ వైఫల్యాలను సరైన రీతిలో ఎండగట్టకుండా ప్రచారపుమబ్బులో కొట్టుకుపోతే ఇవే తనకు ఆఖరి ఎన్నికలు అన్న ఆయన మాటలు అక్షర సత్యాలుగా మారతాయనడంలో సందేహం లేదు .