జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Paswan kalyan ) తన ఎన్నికల ప్రచార రథం వారాహిని సిద్దం చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే పవన్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది.ఏపీలో వైసీపీని ( YCP )ఓడించడమే లక్ష్యంగా టిడిపి, జనసేన లు కూటమి( Janasena TDP alliance ) గా ఏర్పడి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న క్రమంలో, పవన్ చేపట్టబోయే యాత్రపై టిడిపి కూడా ఆసక్తిగా ఉంది.
ఈనెల 14 నుంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను( Pawan Kalyan Varahi Yatra ) మొదలు పెట్టబోతున్నారు.అమలాపురం ,కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధి దాటి , చించినాడ బ్రిడ్జి ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి పవన్ యాత్ర ప్రవేశిస్తుంది.
అయితే పవన్ యాత్ర జరిగే రోడ్లలో పోలీస్ యాక్ట్ 30ని అమలు చేయబోతుండడం పై జనసేన తీవ్రంగా మండిపడుతోంది.

పవన్ యాత్ర ముగిసే వరకు అంటే ఈ నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్ తక్షణం అమల్లోకి వచ్చేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అంటే ఈ యాక్ట్ ప్రకారం సభలు, సమావేశాలు ,ఊరేగింపులు వంటివి నిర్వహించేందుకు అవకాశం ఉండదు.ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తారు.
ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడం, ఈ రెండు జిల్లాల్లో గెలుపోటములు ఆధారంగానే ఏపీలో ప్రభుత్వం ఏర్పడుతుందనే సెంటిమెంట్ ఉండడం, జనసేనకు ఈ రెండు జిల్లాల్లో పట్టు ఉండడంతో, వైసిపి కూడా ఆందోళన చెందుతుంది.టిడిపి, జనసేన లు కలిసి పోటీ చేస్తే ఈ రెండు జిల్లాల్లో తమకు వచ్చే సీట్లు తగ్గుతాయని వైసిపి టెన్షన్ పడుతోంది.
అందుకే ఏదో రకంగా పవన్ యాత్ర ఈ రెండు జిల్లాల్లో కొనసాగకుండా, పోలీస్ యాక్ట్ ను అమల్లోకి తీసుకువస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవంగా జనసేన ను పెద్దగా పట్టించుకోనట్టుగా వైసీపీ వ్యవహరిస్తుంది.అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉండడం, కాపు సామాజిక వర్గంలో పవన్ కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ, సర్వే రిపోర్టులు, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం పవన్ వారాహి యాత్ర ప్రభావం ఈ రెండు జిల్లాల్లో స్పష్టంగా కనిపించబోతోందనే సర్వే నివేదికలతో అలెర్ట్ అవుతూ, ఈ విధంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.







