ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ అనేక డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.వైసిపి 2024 ఎన్నికల్లో తమకు 175 స్థానాలు వస్తాయని నమ్మకంతో ఉంది.
దీనికి తగ్గట్లుగానే ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నాయకులకు టార్గెట్ లు విధిస్తున్నారు.ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను అధికారంలోకి తీసుకొస్తాయని జగన్ ధీమాతో ఉన్నారు.
ఇది ఇలా ఉంటే.ఏపీలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాపులు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడిప్పుడే జనసేన రాజకీయంగా బలోపేతం అవుతుండడంతో కాపుల్లోనూ ఆశలు రేకెత్తుతున్నాయి.ఈ క్రమంలో కాపుల మద్దతు కోసం జనసేన, టిడిపి తో పాటు , వైసిపి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా ఏపీ సీఎం జగన్ కు లేక రాశారు.కాపులకు బిసి రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ లేఖలో కోరారు .
తాము కొత్తగా రిజర్వేషన్లను అడగడం లేదని, తమకు గతంలో ఇచ్చిన వాటిని పునరుద్ధరించమని కోరుతున్నాను అంటూ ముద్రగడ పద్మనాభం జగన్ కు లేఖ రాశారు.ఆ లేఖలో ఎక్కడా ఆయన జగన్ ను కానీ, ఆయన ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదు.
కాపులను బీసీల్లో చేర్చడం అంటే అది పెద్ద తతంగమే.అయితే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది.
ఈ విషయాన్ని కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది .ఈ విషయంలో పూర్తిగా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని ప్రకటించడంతో, సబ్ కేటగిరీ కింద ప్రత్యేక రిజర్వేషన్లను ఆయా రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చని కేంద్రం పేర్కొంది.దీంతో కాపుల్లో ఆశలు రేగాయి.ఆ ప్రత్యేక రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తూ గత టిడిపి ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుతుందని కేంద్రం పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది .దీంతో దాన్ని అమలు చేయమని ఇప్పుడు ముద్రగడ పద్మనాభం జగన్ కు లేఖ రాశారు .అయితే ముద్రగడ ఈ లేఖ రాయడం వెనక రాజకీయం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకం కావడంతో రిజర్వేషన్లు కల్పించాలని విషయంపై వైసీపీలోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది .

కాపులకు రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఆ సామాజిక వర్గం వైసీపీ వైపు చూస్తుందని, జనసేన వైపు వెళ్లకుండా కట్టడి చేయవచ్చనే అభిప్రాయాలు వైసిపిలో ఉన్నాయి.అయితే ఏ హడావుడి లేకుండా ఆ రిజర్వేషన్లను కల్పిస్తే పొలిటికల్ మైలేజ్ రాదనే ఉద్దేశంతోనే ముద్రగడను రంగంలోకి దించారని, ముద్రగడ ద్వారా ఆ డిమాండ్ వినిపించి ఆయన లేఖకు స్పందించే ఈ రిజర్వేషన్లు కల్పించినట్లుగా అందరికీ అర్థమయ్యేలా చేస్తే, అటు ముద్రగడకు మంచి మైలేజ్ వస్తుందని, ఎలాగో ఆయన కుటుంబాన్ని వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో, ఈ రిజర్వేషన్ల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ముద్రగడను పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో పోటీకి దింపితే వర్కౌట్ అవుతుందనే లెక్కల్లో వైసిపి ఉందట.అందుకే ముద్రగడ లేక వెనక వైసిపి ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో అనుమానాలు ఉన్నాయి.







