రాజకీయ పార్టీ అన్న తర్వాత వర్గ విభేదాలు ఉండటం సహజమే.అయితే ఒకే జిల్లాలో ఆధిపత్య పోరు ఉంటే అది అంతిమంగా పార్టీకి నష్టం చేకూరుస్తుంది.
ప్రస్తుతం ఏపీలోని టీడీపీలో అలాంటి పరిస్థితే నెలకొంది.శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది.
గతంలో ఎర్రన్నాయుడు, కళా వెంకట్రావు మధ్య మొదలైన పోరు.ఇప్పుడు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు మధ్య కొనసాగుతోంది.
ఏపీ విభజన తర్వాత టీడీపీకి తొలి అధ్యక్షుడిగా కళా వెంకట్రావును నియమించారు.ఆయన చంద్రబాబు, లోకేష్కు దగ్గర ఉండే వారు.2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం కావడంతో పార్టీ అధ్యక్షుడిని అధిష్టానం మార్చింది.కళా వెంకట్రావు స్థానంలో అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడిని నియమించింది.
ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఆధిపత్య పోరుకు కారణమైంది.అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబు దగ్గర మంచి మార్కులే సంపాదించారు.
అయితే లోకేష్ మీద అచ్చెన్నాయుడు కొన్ని కామెంట్లు చేయడం ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్నాయుడు ఓ హోటల్లో పార్టీపై కామెంట్స్ చేశారంటూ ఓ వీడియో తెగ హల్చల్ చేసింది.అయితే ఆ వీడియోలో ఉన్నది తన వాయిస్ కాదని అచ్చెన్నాయుడు ఖండించారు.అప్పటి నుంచి చినబాబు దగ్గర అచ్చెన్నాయుడికి ప్రాధాన్యత తగ్గిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సమయంలో ఆయన అచ్చెన్నాయుడి ఇంటికి కాకుండా నేరుగా కళా వెంకట్రావు ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.ఈ సందర్భంగా పార్టీ నేతలందరినీ కళా వెంకట్రావు ఇంటికే లోకేష్ పిలిపించుకుని భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు.దీంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అచ్చెన్నాయుడిని కాకుండా కళా వెంకట్రావును ఆశ్రయిస్తున్నారని టాక్ నడుస్తోంది.మొత్తానికి అచ్చెన్నాయుడిని నారా లోకేష్ కావాలనే సైడ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.