చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.
నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు కంటారు.
అయితే అన్ని దేశస్తుల కంటే భారత్, చైనాలకు చెందిన వారే అమెరికాలో ఎక్కువగా అడుగుపెడుతున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం 2020లో అమెరికాలో యాక్టివ్గా వున్న విదేశీ విద్యార్ధుల్లో భారత్, చైనాలకు చెందిన వారు 47 శాతం మంది వున్నారు.
అలా ఎన్నో ఏళ్లుగా భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో విద్య కీలక పాత్ర పోషిస్తోంది.నాలెడ్జ్ ఎకానమీ కోసం కొత్త తరాన్ని నిర్మించ గల సంస్థల స్థాపనపై ఇరు దేశాలు మార్గాలను అన్వేషిస్తున్నాయి.2018-19 విద్యా సంవత్సరానికి దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్ధులు.అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో STEM కోర్సుల్లో చేరుతున్నారు.
వీరితో పాటు అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, నాన్ డిగ్రీ, ఆప్షనల్ ప్రాక్టకీల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లలో చదువుకుంటున్నారు.ఈ నేపథ్యంలో జాయింట్ క్యాంపస్ల నిర్వహణపై ఇరు ప్రభుత్వాలు దృష్టి సారించాయి.
అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ.ఇరు దేశాల్లోని విద్యావేత్తలను, నిపుణులను ఒకచోటికి చేర్చడానికి రెగ్యులర్ ఇంటరాక్షన్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.2020లో ప్రభుత్వం ప్రకటించిన కొత్త విద్యా విధానం భారీ అవకాశాలను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.తాను భారత్తో విద్యా భాగస్వామ్యం నెలకొల్పుకోవాలని ఉత్సాహంగా వున్న అమెరికాలోని రాష్ట్ర గవర్నర్లు, యూనివర్సిటీ ప్రెసిడెంట్లతో ఎప్పటికప్పుడు సంభాసిస్తున్నట్లు సంధూ తెలిపారు.
భారత్- అమెరికాలోని యువత అనుసంధానం చాలా ముఖ్యమైనదన్న ఆయన.భవిష్యత్తులో ఇరు దేశాల భవిష్యత్తును ఇదే నిర్ణయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతేడాది ఆగస్టు నెలలో అమెరికాలోని టాప్ 10 యూనివర్సిటీల అధిపతులతో తరంజిత్ భేటీ అయిన సంగతి తెలిసిందే.జ్ఞానం, సమాచార మార్పిడిలు భారత్- అమెరికా సంబంధాలలో అంతర్భాగమన్నారు.ఇరు దేశాలకు సంబంధించి విద్య, సాంకేతికతలను బలోపేతం చేయడం ప్రధానమైనదన్నారు.సమావేశానికి హాజరైన వారిలో సతీష్ కె త్రిపాఠి, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, బఫెలో; ప్రదీప్ ఖోస్లా (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో); మైఖేల్ రావు (వర్జీనియా కామన్వెల్త్ విశ్వవిద్యాలయం), ప్రొఫెసర్ కుంబ్లే సుబ్బస్వామి (మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం, అమ్హెర్స్ట్); ఆశిష్ వైద్య (నార్త్ కెంటుకీ విశ్వవిద్యాలయం), రేణు ఖాటర్ (యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్), వెంకట్ రెడ్డి (యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో, కొలరాడో స్ప్రింగ్స్), మౌలి అగర్వాల్ (యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీ, కాన్సాస్ సిటీ), మంతోష్ దివాన్ (అప్స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, సునీ) మరియు మహేశ్ దాస్ (బోస్టన్ ఆర్కిటెక్చరల్ కాలేజ్, బోస్టన్) వున్నారు.
ప్రస్తుతం అమెరికాలోని 16 విశ్వవిద్యాలయాలకు అధ్యక్షులుగా భారత సంతతి వ్యక్తులే వున్నారు.